Pahalgam Terrorist Attack : భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేసారు. ఇకపై భారతదేశంలో ఉగ్రవాదం విషయంలో చాలా కఠినంగా ఉంటుందని... దీన్ని అంతమొందించేందుకు ఆర్మీకి అన్ని అధికారాలు ఇస్తున్నట్లు తెలిపారు. భారత సైన్యం ఇకపై ఉగ్రవాదుల వేటలో మరింత దూకుడుగా ఉంటుందని... పహల్గాం ఉగ్రదాడికి సరైన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరిగింది. దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కొన్ని నిర్ణయాలపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో చర్చించారు. ఇప్పుడు రక్షణశాఖతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. దీంతో భారత్ ఏదో గట్టి నిర్ణయమే తీసుకుంటోందని అర్థమవుతోంది. అందుకు తగినట్లుగానే ప్రధాని మోదీ కామెంట్స్ ఉన్నాయి.
ప్రధాని మోదీ రేపు (ఏప్రిల్ 30, బుధవారం) ఢిల్లీలో భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రదాడి తర్వాత ఇది రెండవ కీలక భద్రతా సమావేశం. ఈ సమావేశానికి ముందు రక్షణ శాఖ మంత్రి, ఉన్నతాధికారులు ప్రధాని సమావేశమయ్యారు.
బుధవారం ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశం భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. సిసిఎస్, సిసిపిఎ తర్వాత ఆర్థిక వ్యవహారాల కమిటీ కూడా సమావేశం కానుంది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం ఇప్పటికే నిర్ణయించింది. సరిహద్దులను మూసివేసింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్లు, ఎక్స్ హ్యాండిల్లను బ్లాక్ చేసింది. పాకిస్తాన్ హిందువులు, దీర్ఘకాలిక వీసాలు ఉన్నవారిని మినహాయించి పాకిస్తాన్ పౌరుల వీసాలను ఢిల్లీ రద్దు చేసింది. వైద్య వీసాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది.