
పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో, సమావేశానికి ముందు ఎన్డీఏ నేతలు ప్రధాని మోదీని అభినందించారు. ఈ ఆపరేషన్ భారత్ భద్రతా వ్యూహంలో కీలక ఘట్టంగా నిలిచింది.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును వేర్వేరుగా రాష్ట్రపతి భవన్లో కలిసిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలపై అధికారిక ప్రకటన లేకపోయినా, జమ్మూ కశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్ధరణపై చర్చ జరిగి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేసి ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్న వేళ, ఈ చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పరిణామాలపై స్పందించారు. “ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రహోదా చర్చకు వచ్చే అవకాశం లేదనుకుంటున్నాను. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముగింపు నాటికి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది” అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై తాను ఇంకా ఆశతో ఎదురుచూస్తున్నానని చెప్పారు.
ఈ సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి. జమ్మూ కశ్మీర్ అంశం, ప్రతిపక్ష విమర్శలకు ప్రతిస్పందన, రాబోయే శాసన కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.