Pakistan: భారత్‌పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి.. పాక్ మంత్రి పిచ్చి మాటలు

Published : Apr 27, 2025, 01:31 PM IST
Pakistan: భారత్‌పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయి.. పాక్ మంత్రి పిచ్చి మాటలు

సారాంశం

పహల్గాం దాడి తర్వాత ఇండియా-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మంత్రి చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పాకిస్తాన్ ప్రధాని నుంచి విదేశాంగ, రక్షణ మంత్రుల వరకు యుద్ధానికి సిద్ధమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పాకిస్తాన్ మంత్రి అణు దాడి చేస్తామని బెదిరించాడు.

పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి మాట్లాడుతూ, పాకిస్తాన్ దగ్గర గౌరీ, షాహీన్, గజనవి క్షిపణులతో పాటు 130 అణు ఆయుధాలు ఉన్నాయని, అవన్నీ ఇండియా కోసమే అని అన్నాడు. ఇండియా వైపే వాటిని గురిపెట్టామని చెప్పాడు.

సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసి, పాకిస్తాన్‌కు నీటి సరఫరా ఆపేస్తే యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అబ్బాసి హెచ్చరించాడు. పాకిస్తాన్ అణ్వాయుధాలు ప్రదర్శన కోసం కాదని, దేశమంతటా రహస్య ప్రదేశాల్లో వాటిని దాచామని, రెచ్చగొడితే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నాడు.

“నీళ్ళు ఆపేస్తే యుద్ధానికి సిద్ధంగా ఉండండి. మా దగ్గర ఆయుధాలు, క్షిపణులు ఉన్నాయి. అవి ప్రదర్శన కోసం కాదు. దేశమంతటా ఎక్కడెక్కడ అణ్వాయుధాలు దాచామో ఎవరికీ తెలియదు. మళ్ళీ చెప్తున్నా, ఈ క్షిపణులన్నీ మీ మీదే గురిపెట్టాం” అని అబ్బాసి అన్నాడు.

పహల్గాం దాడి తర్వాత సింధు జల ఒప్పందం రద్దు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యగా ఇండియా 1960 నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్తాన్ పౌరుల వీసాలను కూడా రద్దు చేసింది.

నీటి సరఫరా, వాణిజ్య సంబంధాలు ఆపేయడం వల్ల ఇండియాకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అబ్బాసి ఎద్దేవా చేశాడు. పాకిస్తాన్ ఇండియాకు తన గగనతలం మూసివేసిందని, రెండు రోజుల్లోనే ఇండియా విమానయాన రంగం అస్తవ్యస్తమైందని అన్నాడు. “ఇలాగే పది రోజులు ఉంటే ఇండియా ఎయిర్‌లైన్స్ దివాలా తీస్తాయి” అని అన్నాడు.

ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చామని ఒప్పుకున్న రక్షణ మంత్రి 

కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు, శిక్షణ ఇస్తోందని ఆసిఫ్ ఒప్పుకున్నాడు. అయితే దానికి అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలే కారణమని ఆరోపించాడు.

“మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాల కోసం మేం ఈ పని చేస్తున్నాం. ఇది తప్పే. దీనివల్ల పాకిస్తాన్‌కు చాలా నష్టం జరిగింది. సోవియట్ యూనియన్‌తో యుద్ధంలో, 9/11 తర్వాత మేం పాల్గొనకపోతే పాకిస్తాన్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేది” అని ఆసిఫ్ అన్నాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu