భారత్ ను మరింత రెచ్చగొడుతున్న పాక్ ... విధించిన ఆంక్షలివే

Published : Apr 24, 2025, 05:42 PM ISTUpdated : Apr 24, 2025, 05:52 PM IST
భారత్ ను మరింత రెచ్చగొడుతున్న పాక్ ... విధించిన ఆంక్షలివే

సారాంశం

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరుదేశాలు ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకున్నాయి. తాజాగా భారత్ పై పాక్  ఆంక్షలు విధించింది... వాటిగురించి తెలుసుకుందాం.   

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ దాడిలో అమాయకులైన 26 మంది పర్యాటకులు మరణించారు. కశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన హిందు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపారు ఉగ్రవాదులు. ఈ దాడి వెనక పాక్ హస్తం ఉందని బలంగా నమ్ముతూ ఆ దేశంపై చర్యలు తీసుకుంది భారత్. పాక్ పౌరుల వీసాల రద్దు, ఇరుదేశాల మధ్యగల వాఘా బార్డర్ మూసివేత, సిందుజలాల ఒప్పందం నిలిపివేత వంటి నిర్ణయాలున్నాయి.  

అయితే పాకిస్థాన్ కూడా భారత్ చర్యలకు ప్రతిచర్యలు చేపట్టింది. తన సార్వభౌమత్వానికి, భద్రతకు ఏదైనా ముప్పు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని భారత్ ను హెచ్చరించింది. ఈ క్రమంలోనే పాక్ కూడా భారత్ పై ఆంక్షలు విధించింది.

పాకిస్థాన్ భారత్ పై విధించిన ఆంక్షలివే :

పాకిస్తాన్ తన భూభాగం ద్వారా భారత్‌ సాగించే అన్ని వాణిజ్య వ్యవహారాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే పాకిస్తాన్ గగనతలంలో భారత విమానయాన సంస్థలకు చెందిన విమానాలు ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది. ఇక వాఘా సరిహద్దును కూడా మూసివేసింది. భారత హైకమిషన్‌లోని సైనిక సలహాదారులు ఏప్రిల్ 30 నాటికి తమ దేశాన్ని వదిలి వెళ్లిపోవాలని పాకిస్తాన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. 

సిమ్లా ఒప్పందంతో సహా భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేస్తామని పాకిస్తాన్ ప్రకటించింది.​ అలాగే పాకిస్తాన్ భారత సైనిక దౌత్యవేత్తలను పర్సన్ నాన్ గ్రాటాగా ప్రకటించింది... ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యవేత్తల సంఖ్యను 30కి తగ్గించింది.​

పాక్ పై భారత్ విధించిన ఆంక్షలివే :

వీసా రద్దు : పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు ఏప్రిల్ 27, 2025 లోపు రద్దు చేయబడ్డాయి. వైద్య వీసాలు ఏప్రిల్ 29, 2025 వరకు చెల్లుతాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులు వారి వీసా గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలని సూచించారు.​

ప్రయాణ సలహాలు : భారత పౌరులు పాకిస్తాన్‌కు ప్రయాణించవద్దని, ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నవారు వెంటనే భారతదేశానికి తిరిగి రావాలని కోరారు.​

దౌత్య చర్యలు: భారత్ దౌత్య సంబంధాలను తగ్గించింది, పాకిస్తాన్ రక్షణ ప్రతినిధులను బహిష్కరించింది ఇస్లామాబాద్‌లోని తన దౌత్య సిబ్బందిని తగ్గించింది.​

సింధు నదుల ఒప్పందం: దశాబ్దాల నాటి సింధు నదుల ఒప్పందం నిలిపివేయబడింది, ఇది రెండు దేశాల మధ్య నీటి పంపిణీ ఒప్పందాలలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.​

భారత్-పాక్ వివాదం :

ఈ పరిణామాలు భారత్-పాకిస్తాన్ సంబంధాలలో తీవ్రమైన ఉద్రిక్తతను సూచిస్తున్నాయి. ఇది దౌత్య, ఆర్థిక సంబంధాలనే కాదు ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేస్తాయి. 1972 నుండి ద్వైపాక్షిక సంబంధాలకు మూలస్తంభంగా ఉన్న సిమ్లా ఒప్పందం నిలిపివేయడం వల్ల రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదరనుంది.  అంతర్జాతీయ సమాజం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది... ఉద్రిక్తతను నివారించడానికి ఇరుదేశాలు చర్చించుకోవాలని సూచిస్తోంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India Gate Ahead of Republic Day 2026: త్రివర్ణ దీపాల కాంతులతో ఇండియా గేట్ | Asianet Telugu
Fresh Snowfall in Sonamarg: మోదీ ప్రారంభించిన సోనమార్గ్ఇప్పుడు ఎలా ఉందో చూడండి| Asianet News Telugu