India Pakistan : ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత అనుకోని సంఘటన చోటుచేసుకుంది.పంజాబ్లోని అమృత్సర్లో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించాయనే వార్తలు సోమవారం రాత్రి వెలుగులోకి వచ్చాయి. ఇలా ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగిన నేపథ్యంలో అమృత్సర్ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఢిల్లీకి తిరిగి పంపినట్లు తెలిసింది.
“న్యూఢిల్లీ-అమృత్సర్ ఇండిగో విమానం (6E 2045) బ్లాక్అవుట్ SOP మరియు పంజాబ్లోని అమృత్సర్లో డ్రోన్ కార్యకలాపాల అనుమానం కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది” అని ఓ ప్రయాణికుడు విమానం లోపలి వీడియోను జతచేసి ఎక్స్ లో పోస్ట్ చేసాడు.
అంతకుముందు అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ కూడా తాజా పరిస్థితులపై ఎక్స్ లో కీలక ప్రకటన చేసారు.“భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మీకు మళ్లీ సైరన్ వినిపిస్తుంది. మేము అప్రమత్తంగా ఉన్నాము...మళ్లీ బ్లాక్అవుట్ ప్రారంభిస్తున్నాము. దయచేసి మీ లైట్లను ఆపివేసి, మీ కిటికీల నుండి దూరంగా వెళ్లండి. ప్రశాంతంగా ఉండండి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేము మీకు తెలియజేస్తాము. అస్సలు భయపడవద్దు. ఇది ముందు జాగ్రత్త మాత్రమే” అని అమృత్ సర్ డిప్యూటీ కమిషనర్ సూచించారు.
జమ్మూ కాశ్మీర్లోని సాంబాలో బ్లాక్అవుట్ నడుస్తుండగా భారత వైమానిక రక్షణ పాకిస్తాన్ డ్రోన్లను అడ్డుకుంది. పలుప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. సాంబా సెక్టార్లో కొన్ని డ్రోన్లు వచ్చాయని... వాటిని ఎదుర్కొంటున్నామని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
DGMO చర్చలు: ఏం జరిగింది?
భారతదేశం మరియు పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) సోమవారం సాయంత్రం 5 గంటలకు కీలక చర్చలు జరిపారు. ఇరువైపులా ఒక్క బుల్లెట్ కూడా కాల్చకూడదనే మరియు దూకుడు చర్యలకు పాల్పడకూడదనే నిబద్ధతను కొనసాగించడంపై చర్చలు జరిగాయి. సరిహద్దులు మరియు ముందు ప్రాంతాల నుండి దళాల తగ్గింపును నిర్ధారించడానికి తక్షణ చర్యలను పరిగణించాలని కూడా అంగీకరించారు.
రెండు దేశాల మధ్య DGMO స్థాయి చర్చలు సోమవారం మధ్యాహ్నం జరగాల్సి ఉండగా, తరువాత సాయంత్రానికి వాయిదా వేశారు. పాకిస్తాన్ DGMO తన భారత ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైకి చేసిన పిలుపు తర్వాత కాల్పుల విరమణ మరియు సైనిక చర్యలపై శనివారం రెండు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.