
తిరువనంతపురం:
కేరళలో వాతావరణ పరిస్థితులు క్రమంగా తీవ్రమవుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పతనంతిట్ట, ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ఈ మూడు జిల్లాలకు కేంద్ర వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక రేపు అంటే మే 14న ఎర్నాకులం, మలప్పురం, వయనాడ్, కన్నూర్ జిల్లాల్లో వర్షాల ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలకు కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ వర్షాలు ఏకధాటిగా కురిసే అవకాశం ఉండటం, 24 గంటల్లో 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటం వల్ల ఇవి భారీ వర్షాలుగా పరిగణించబడుతున్నాయి.
ఇక వర్షాలపాటు కల్లకడల్ ప్రభావం కూడా తీరప్రాంతాలను ప్రభావితం చేయనుంది. మే 14 రాత్రి 11.30 గంటల వరకూ కేరళ తీరంలో 0.4 నుంచి 0.8 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశముందని, సముద్రం ఉప్పొంగే ప్రమాదం ఉందని జాతీయ సముద్ర పరిశోధనా సంస్థ INCOIS హెచ్చరించింది. అదే విధంగా, కన్యాకుమారి తీరంలో అదే సమయానికి 0.9 నుంచి 1 మీటర్ల ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశముంది.
ఈ పరిస్థితుల మధ్య మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఈ సమయంలో సముద్రంలోకి బోట్లు, పడవలను తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికార యంత్రాంగం కోరుతోంది. మత్స్యకార పడవలు హార్బర్ల్లో సురక్షితంగా ఉంచాలని, బీచ్లలో పర్యాటక కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేయాలని సూచనలొచ్చాయి.
సముద్రం ఉప్పొంగే అవకాశం ఉండటంతో, ఈత, బీచ్లకు వెళ్లడం వంటి కార్యకలాపాలను పూర్తిగా నివారించాలని అధికారుల హెచ్చరిక స్పష్టం చేసింది. తీరప్రాంతాల్లో భూమి క్షీణించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.