రైల్వే ఘనకార్యం: 3013వ సంవత్సరానికి టికెట్.. కోర్టు మొట్టికాయలు
ఇప్పటికే అనుకున్న సమయానికి రావని.. సర్వీస్ బాగుండదని ప్రయాణికుల నుంచి మాంచి పేరు కొట్టేసిన ది గ్రేట్ ఇండియన్ రైల్వేస్ మరో అప్రతిష్ట మూటగట్టుకుంది.. ఏకంగా 3013 వ సంవత్సరానికి టికెట్ జారీ చేసి సదరు ప్రయాణికుడిని తీవ్ర ఇబ్బందుల పాలు జేసింది. వివరాల్లోకి వెళితే.. సహారన్పూర్ నుంచి జావున్పూర్ వెళ్లేందుకు ఓ రిటైర్డ్ ప్రోఫెసర్ హిమగిరి ఎక్స్ప్రెస్ రైలున 2013 నవంబర్ 19వ తేదికి టికెట్ బుక్ చేసుకున్నాడు..
ప్రయాణం రోజున రైలు ఎక్కి కూర్చొన్నాడు.. ఆపైన టీసీ వచ్చి టికెట్ అడిగితే చూపించాడు.. దాన్ని పరిశీలించిన టీటీఈ ఆగ్రహంతో ప్రొఫెసర్ను కిందకు దించేశాడు.. విషయం ఏంటీ అని ఆరా తీస్తే.. దానిపై నవంబర్ 19, 2013 బదులు.. నవంబర్ 19, 3013 అని ఉంది.. దీనిని నకిలీ టికెట్గా భావించిన టీసీ ప్రయాణికుడిని కిందకు దించేశాడు.. ఇందులో తన తప్పు ఏం లేదని ఎంతగా మొత్తుకున్నా వినిపించుకోలేదు.. నలుగురి ముందు తనకు జరిగిన అవమానానికి మనస్తాపానికి గురైన ప్రొఫెసర్.. వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు.. దీనిపై ఏడేళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం తప్పును భారతీయ రైల్వేలదిగా తేల్చి.. రైల్వేశాఖకు రూ.13 వేల జరిమానా విధించింది.