కాంగ్రెస్ తో తస్మాత్ జాగ్రత్త... వాళ్లకోసం మన ఆస్తిపాస్తులు లాక్కునే కుట్రలు... : మోదీ ఎమోషనల్ లేఖ

By Arun Kumar PFirst Published Apr 30, 2024, 2:08 PM IST
Highlights

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మతపరమైన రిజర్వేషన్ల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజెపి అభ్యర్థులకు ఓ ఆసక్తికరమైన లేఖ రాసారు. 

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ జరగాల్సి వుండగా ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మే 4న మూడో విడత పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్ర గుజరాత్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లోని లోక్ సభలకు ఈ మూడో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బిజెపి అభ్యర్థులకు ప్రధాని ఓ లేఖ రాసారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని ఈ లేఖ ద్వారా సూచించారు మోదీ. 

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి అలయన్స్ ప్రలజమధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేసారు.కాబట్టి ఓటర్లను చైతన్యపర్చాల్సిన బాధ్యత ప్రతి అభ్యర్థిపై వుందన్నారు. ఎస్సి, ఎస్టి, ఓబిసి ల రిజర్వేషన్లు లాక్కుని తమ ఓటుబ్యాంకుకు ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది... అందుకోసమే మతపరమైన రిజర్వేషన్లకు తెరలేపిందని అన్నారు. ఇలాంటివి రాజ్యాంగ విరుద్దమన్నారు. అంతేకాదు ప్రజలు కష్టపడి సంపాదించిన ఆస్తులను కూడా లాక్కుని తమ ఓటుబ్యాంకుకు ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా పేర్కొన్నారు. వారసత్వ పన్ను వంటివి తీసుకువచ్చే ఆలోచన కూడా కాంగ్రెస్ కు వుందన్నారు. ఇలాంటివి జరక్కుండా వుండాలంటే దేశమంతా ఒక్కటి కావాల్సిన అవసరం వుందని ప్రధాని సూచించారు. 

వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి... దీంతో పోలింగ్ రోజు ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బంది పడతారు. కానీ ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి... కాబట్టి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా ముఖ్యం. పోలింగ్ రోజు ఉదయమే ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ఎండ నుండి తప్పించుకోవచ్చని ఓటర్లకు సూచించారు.   

బిజెపి నాయకులు, కార్యకర్తలు కూడా ఓటర్లును చైతన్యపర్చాలని... ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని ప్రధాని సూచించారు. ప్రతి బూత్ లో బిజెపిని గెలిపించేలా కృషిచేయాలి... అప్పుడు ఆ లోక్ సభలో విజయం వరిస్తుంది. ఇదే సమయంలో ప్రజల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. 

 బిజెపికి దక్కే ప్రతి ఓటు బలమైన ప్రభుత్వ ఏర్పాటు.... 2047 వరకు దేశాన్ని మరింత అభివృద్ది చేసే దిశగా నడిపిస్తాయని అన్నారు. మన విజన్ కు ప్రజల మద్దతు లభిస్తుందని నమ్ముతున్నారు...  అందువల్లే ఎన్నికల కంటే ముందే విజయంపై నమ్మకంతో వున్నానన్నారు. మన ఉజ్వల భవిష్యత్ కోసం ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన నుండి విముక్తి పొందే మరో అవకాశం వచ్చిందన్నారు. గత పదేళ్ల బిజెపి పాలనలో సమాజంలోని ప్రతిఒక్కరి జీవితంలో మార్పులు వచ్చాయి... ప్రజల సమస్యలు దూరం అయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు. 

ఓటర్ దేవుళ్ల ఆశీర్వాదంతో గెలిచివచ్చే మీతో మళ్లీ కలిసి పనిచేస్తానని అభ్యర్థులకు రాసిన లేఖలో పేర్కొన్నారు ప్రధాని. ప్రజల ఆశలు, ఆకాంక్షలను రాబోయే ఎన్డిఏ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. పాలనలో మీ అందరి సహకారం ఎంతో ముఖ్యమైనది. మోదీ ప్రతిక్షణం దేశ ప్రజలదే అని గ్యారంటీ ఇస్తున్నాను...ప్రతి ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకుని ఎన్నికల వ్యవస్థను విజయవంతం చేయాలని కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 


 

click me!