ఆపరేషన్ సిందూర్లో భారత్ అత్యాధునిక ఆయుధాలతో పాక్ ఉగ్ర స్థావరాలపై ఏకకాల దాడులు, స్కాల్ప్, హ్యామర్ బాంబుల వినియోగంతో శత్రుమూకలకు చుక్కలు చూపించారు.
పాకిస్తాన్లోని కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దేశ భద్రతా రంగంలో గణనీయమైన ముందడుగు. ఈ సుదీర్ఘంగా ప్రణాళిక చేసిన దాడిలో భారత త్రివిధ దళాలు సమన్వయంతో పని చేశాయి. ఏకకాలంలో పలు ప్రదేశాల్లో జరిగిన ఈ దాడులు ఉగ్ర మూలాలను నాశనం చేయడమే కాకుండా, భారత్ ఆపరేషన్లు నిర్వహించే స్థాయిని కూడా ప్రపంచానికి చాటిచెప్పాయి.
ఈ దాడిలో అత్యాధునిక ఆయుధాలు వాడినట్టు విశ్వసించబడుతుంది. వీటిలో ముఖ్యంగా ‘లాయిటరింగ్ మ్యూనిషన్’ అనే ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. ఇవి లక్ష్యాన్ని గుర్తించి స్వయంగా దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటితో పాటు నిఘా సామర్థ్యాలు కూడా ఉండటం వల్ల, భద్రతా దళాలకు ప్రాణాపాయం లేకుండా లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలిగారు.
ఫ్రాన్స్ తయారీ స్కాల్ప్ మిసైళ్లను రఫేల్ యుద్ధవిమానాల నుంచి ప్రయోగించినట్టు సమాచారం. ఇవి సుదూర లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదించే శక్తి కలిగిన క్రూయిజ్ మిసైళ్లుగా పేరు పొందాయి. దాదాపు 250 కిలోమీటర్ల దూరం నుంచే లక్ష్యాన్ని ఛేదించగలవు.భద్రతా కట్టడాలు బలంగా ఉన్న భవనాలు, బంకర్లపై దాడులకు ‘హ్యామర్’ బాంబులను వాడినట్టు తెలుస్తోంది. వీటిని చాలా ఎత్తు నుంచే ప్రయోగించగల సామర్థ్యం ఉండటం వీటి ప్రత్యేకత. లక్ష్యాన్ని దూరం నుంచే ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి.
పాకిస్తాన్లోని జైషే మహ్మద్ ప్రధాన కేంద్రంగా భావించే బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఉగ్ర స్థావరం, లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంగా చెప్పుకునే మురిద్కే ప్రాంతంలోని స్థావరాలపై దాడులు జరిపినట్టు తెలుస్తోంది. ఇవి సరిహద్దుకు చాలా సమీపంగా ఉన్న ప్రాంతాలు కావడం వల్ల, ప్రణాళికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
వాయుసేన, భూసేన, నౌకాసేనలు కలసి పనిచేసిన ఈ ఆపరేషన్లో, పీ8ఐ నిఘా విమానాలు, ఎంక్యూ9 డ్రోన్లతో సమర్థవంతమైన సమాచార సేకరణ జరిగింది. ప్రధాన టార్గెట్లను వాయుసేన తాకినట్లు సమాచారం, మిగిలిన ప్రాంతాల్లో ఆర్మీ ప్రాభావం చూపింది.ఆపరేషన్ సిందూర్ తీరును చూస్తే, భారత్ ఇక కేవలం నిరీక్షించే దేశంగా కాకుండా, అవసరమైతే ముందుగానే దాడులకు దిగే స్థాయికి ఎదిగిందని స్పష్టమవుతోంది.