భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ముగుస్తోందని వస్తున్న వార్తలను రక్షణ శాఖ వర్గాలు ఖండించాయి. మే 10న ఇరు దేశాల మధ్య జరిగిన డీజీఎంవో (DGMO) చర్చల అనంతరం ఏర్పడిన కాల్పుల విరమణ అవగాహన ఇప్పటికీ అమల్లో ఉందని స్పష్టం చేశాయి. ఈ ఒప్పందానికి ఎలాంటి ముగింపు తేదీ లేదని, ఇది కొనసాగుతూనే ఉంటుందని అధికారులు తెలిపారు.
రక్షణ శాఖ వర్గాల ప్రకారం, ఈ రోజు (ఆదివారం) DGMO స్థాయిలో ఎలాంటి చర్చలు జరగలేదని, ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొన్నారు. మే 10న జరిగిన చర్చల సమయంలో తాత్కాలికంగా కాల్పులు ఆపేందుకు ఇరుదేశాలు అంగీకరించగా, దానికి కాలపరిమితి లేదని తెలిపారు.
ఇక పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి భారత బలగాలు తీవ్రంగా ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. భారత్ చేపట్టిన యాక్షన్ దెబ్బకు పాకిస్థాన్ దిగొచ్చింది. ఎదురుదాడికి ప్రయత్నించినా భారత సైన్యం ధీటైన సమాధానం ఇచ్చింది. దీంతో ఉద్రిక్తతలు తగ్గించాలని పాకిస్థాన్ అభ్యర్థించగా, భారత్ పాక్షికంగా అంగీకరించింది.
ఈ పరిస్థితుల్లో మే 10న డీజీఎంవో స్థాయిలో చర్చలు జరిపి, కాల్పులు నిలిపివేయాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ప్రస్తుతం ఆ అవగాహనే కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.