
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ(మంగళవారం) చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్-చైనా మధ్య ఉద్రిక్తత తగ్గించి, సంబంధాలు మెరుగుపరుచుకునే దిశగా ఈ భేటీలో చర్చలు జరిగాయి.
చైనా విదేశాంగ మంత్రితో భేటీ గురించి మోదీ ఎక్స్ వేదికన వెల్లడించారు. "విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలవడం సంతోషంగా ఉంది. గత ఏడాది కజాన్లో అధ్యక్షుడు జిన్పింగ్తో జరిగిన నా భేటీ తర్వాత ఇండియా-చైనా సంబంధాలు స్థిరంగా పురోగమిస్తున్నాయి" అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన చైనా పర్యటనను కూడా ప్రధాని ధ్రువీకరించారు. "SCO సదస్సు సందర్భంగా టియాంజిన్లో మళ్ళీ కలుసుకుంటాం. స్థిరమైన, ఆచరణాత్మక, నిర్మాణాత్మక సంబంధాలు, ప్రాంతీయ, ప్రపంచ శాంతి, శ్రేయస్సుకు దోహదపడేలా భారత్-చైనా మధ్య చర్చలుంటాయి" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
వాంగ్ యీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు భారత్ లో పర్యటిస్తున్నారు. ఇరుదేశాల సరిహద్దు అంశాలపై 24వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల సమావేశంలో చర్చల కోసం ఆయన భారత పర్యటనకు వచ్చారు. అంతకుముందు ఆయన దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్లతో చర్చలు జరిపారు.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో జరిపిన భేటీలో టియాంజిన్లో జరగనున్న SCO సదస్సు గురించి చర్చించారు. సరిహద్దు సంప్రదింపులకు లక్ష్యాలను నిర్దేశించడానికి, సహకారాన్ని విస్తరించడానికి న్యూఢిల్లీతో కలిసి పనిచేయడానికి బీజింగ్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య సోమవారం జరిగిన భేటీలో సంవత్సరాల ఉద్రిక్తత తర్వాత ఇండియా-చైనా సంబంధాలను తిరిగి మార్చుకునే ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది.