కరోనాతో అతలాకుతలమవుతున్న భారత్ను ఆదుకునేందుకు ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వీరికి తోడు అనేక దిగ్గజ సంస్థలు కూడా ఇండియాకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి.
కరోనాతో అతలాకుతలమవుతున్న భారత్ను ఆదుకునేందుకు ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వీరికి తోడు అనేక దిగ్గజ సంస్థలు కూడా ఇండియాకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర అత్యవసర పరికరాలు, విరాళాలను అందజేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ భారత్కు రూ. 113 కోట్ల కరోనా సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు గురువారం గూగుల్ ఒక సమావేశంలో తెలిపింది.
భారత్లో 80 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పడంతో పాటు వివిధ సంస్థల భాగస్వామ్యంతో గ్రామీణ భారతంలో ఆరోగ్య కార్యకర్తల సంఖ్యను పెంచే కార్యక్రమాన్ని గూగుల్ చేపట్టనుంది. దీనిలో భాగంగా గివ్ ఇండియా సంస్థకు 90 కోట్ల రూపాయలు, 18.5 కోట్ల రూపాయలను పాత్ సంస్థకు అందజేస్తామని వెల్లడించింది. అంతేకాకుండా కొవిడ్ 19 కోసం గ్రామీణ ప్రాంతాల్లోని 20 వేల మందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్న అపోలో మెడ్స్కిల్స్కు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని గూగుల్ ప్రకటించింది. 15 రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్మాన్ సంస్థకు 3.6 కోట్లను మంజూరు చేయనుంది.
Also Read:ఇండియాలో తగ్గుముఖం పట్టిన కరోనా: లక్షలోపు నమోదౌతున్న కోవిడ్ కేసులు
ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసుకోవడం తమ బాధ్యత అన్న గూగుల్.. గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న సంక్షోభం నుంచి భారత్ నెమ్మదిగా బయటపడుతోంది. దీని కోసం ప్రభుత్వాలు, సంస్థలు, సంఘాలు కలిసి పనిచేయడం స్ఫూర్తిదాయకమని ఓ ప్రకటనలో తెలిపింది. భారత్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి గూగుల్ సహకరిస్తుందని వెల్లడించింది. గూగుల్ అందించిన రెండు గ్రాంట్లతో కరోనా సంక్షోభంలో తీవ్రంగా భారత్ పుంజుకుంటుందని సంస్థ ఆకాంక్షించింది.
గివ్ ఇండియా సీఈవో అతుల్ సతిజా మాట్లాడుతూ... పాత్ సంస్థతో కలిసి దేశంలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీని కోసం పాత్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తుందన్నారు. వీటిని మూడు నుంచి ఆరు నెలల్లోపు అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.