మహిళలకు శుభవార్త.... మెట్రో, బస్సుల్లో ఉచిత ప్రయాణం

By telugu teamFirst Published Jun 3, 2019, 1:48 PM IST
Highlights

మహిళలపై కేజ్రీవాల్ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. ఢిల్లీలో మెట్రో, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

మహిళలపై కేజ్రీవాల్ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. ఢిల్లీలో మెట్రో, బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటన చేసింది. ఈ ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని.. వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. 

త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలోనే మహిళలను ఆకట్టుకునేందుకు కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కాగా అంతకు ముందు ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లోట్‌ ఈ విషయమై ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సీనియర్‌ అధికారులను కలిసి వారితో చర్చించారు. ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించారు. 

అలాగే కొత్త ప్రతిపాదన వల్ల మెట్రో ఆదాయంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియజేయాలని కోరారు. ఢిల్లీ మెట్రోలో ప్రతి రోజూ దాదాపు 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం వల్ల ఆదాయంపై ఎంత మేరకు ప్రభావం పడుతుందో కచ్చితంగా చెప్పలేమని, మహిళా ప్రయాణికులు ఎంత మందో తెలుసుకోవడానికి కొత్తగా సర్వే చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

ఢిల్లీలో ప్రజలు మెట్రోలో కన్నా బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో నిత్యం దాదాపు 42 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అయితే బస్సుల్లో ప్రయాణించే మహిళల వాటా 20 శాతం కన్నా ఎక్కువగా ఉండకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

click me!