ఫిరోజ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న గ్యాంగ్స్టర్లకు మొబైల్ ఫోన్లు,నిషిద్ధ వస్తువులను అందించినందుకు జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గురు చరణ్ సింగ్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
ఫిరోజ్పూర్ సెంట్రల్ జైలులోని గ్యాంగ్స్టర్లు, స్మగ్లర్లు, ఖైదీలకు మొబైల్ ఫోన్లు,మాదకద్రవ్యాలను సరఫరా చేసినందుకు గాను డిఎస్పి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గురు చరణ్ సింగ్ పై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలులోని హైసెక్యూరిటీ జోన్కు డ్రోన్ల ద్వారా మొబైల్స్, డ్రగ్స్ అందించారు.ప్రతిఫలంగా గ్యాంగ్స్టర్ల నుంచి భారీ మొత్తంలో నగదును స్వీకరించారు.
ఫిరోజ్పూర్లోని సెంట్రల్ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గురు చరణ్ సింగ్ పై ఎన్డిపిఎస్ చట్టం, ఐపిసి, అవినీతి నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు జైలు మంత్రి హర్జోత్ బైన్స్ తెలిపారు.ఫిరోజ్పూర్ సెంట్రల్ జైలులో ఉన్న హై రిస్క్ ఖైదీలతో గురు చరణ్ సింగ్ కుమ్మక్కయ్యాడని ఆరోపణలు వచ్చాయి.
ఫిరోజ్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) సురేంద్ర లాంబా మాట్లాడుతూ.. “ జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గురు చరణ్ సింగ్ ఇతర జైలు ఉద్యోగులతో సహకారంతో జైలులో ఉన్న గ్యాంగ్స్టర్లకు,
ఉగ్రవాదులతో సహా ఇతర ఖైదీలకు మొబైల్ ఫోన్, డ్రగ్స్ను అక్రమంగా రవాణా చేస్తున్నాడని సమాచారం అందింది.
దాదాపు నెల రోజుల క్రితం జైలులోని హైసెక్యూరిటీ జోన్లోని ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లకు డబ్బు కోసం ఐదు మొబైల్ ఫోన్లను అందించాడు. డిప్యూటీ సూపరింటెండెంట్పై ఎన్డిపిఎస్ చట్టంలోని సెక్షన్లు 23/29, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 120-బి, ప్రిజన్స్ యాక్ట్లోని సెక్షన్ 42తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7/8 కింద బుక్ చేశాం అని తెలిపారు.
గత రెండేళ్లలో ఫిరోజ్పూర్ జైలులో 500కు పైగా ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పలుమార్లు జైలులో భద్రత లోపాలు భయపడ్డాయి. 2021లో జైలులోని ఖైదీల నుంచి దాదాపు 300 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.అంతేకాకుండా, జైలు ఆవరణలో పలుమార్లు నిషేధిత ప్యాకెట్లు బయటపడ్డాయి.
మే 29న మాన్సా జిల్లాలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్య తర్వాత ప్రొడక్షన్ వారెంట్పై తీసుకొచ్చిన గ్యాంగ్స్టర్ మన్ప్రీత్ సింగ్, అలియాస్ మన్నా నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు, అతను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్తో టచ్లో ఉన్నాడని పోలీసులకు బలమైన ఆధారాలు లభించాయి.