నాలుగు రోజుల ఉద్రిక్తత తర్వాత భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన బృందం తెరవెనుక ఉండి రెండు దేశాలను చర్చలకు ఒప్పించారు.
నాలుగు రోజుల ఘర్షణ తర్వాత శనివారం భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. ఈ విషయంలో రెండు దేశాలనూ ఒప్పించడంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన ప్రభుత్వంలోని వారి కీలక పాత్ర పోషించారు.
CNN నివేదిక ప్రకారం, ట్రంప్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. వీరిలో ఉపాధ్యక్షుడు జెడి వాన్స్, విదేశాంగ మంత్రి, తాత్కాలిక జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూజీ విల్స్ ఉన్నారు. ఈ బృందం భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణపై నిశితంగా దృష్టి సారించింది. శుక్రవారం ఉదయం అమెరికాకు భయంకరమైన గూఢచర్య సమాచారం అందింది.
అమెరికాకు ఇంటెలిజెన్స్ సమాచారం అందిన వెంటనే
జెడి వాన్స్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడారు. దీంతో అమెరికాకు అందిన ఆ సమాచారం ఏంటన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం యుద్ధ వాతావరణం మరో రోజు కొనసాగితే తీవ్ర పరిమాణాలు వాటిల్లేవని తెలుస్తోంది. ఈ వారాంతం వరకు ఘర్షణ కొనసాగితే ఉద్రిక్తతలు నాటకీయంగా పెరిగే అవకాశం ఉందని వైట్ హౌస్ కు సమాచారం వచ్చినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని జేడీ వాన్స్ మోదీకి వివరించారని సమాచారం. భారత్ పాకిస్తాన్తో నేరుగా చర్చలు జరపాలని, ఉద్రిక్తత తగ్గించేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించాలని వాన్స్ నరేంద్ర మోదీకి సూచించారు.
ఆ సమయంలో రెండు దేశాలు చర్చలు జరపడం లేదని అమెరికా భావించింది. వాళ్ళని మళ్ళీ చర్చలకు తీసుకురావాలి. పాకిస్తాన్ అంగీకరించే అవకాశం ఉన్న ఒక మార్గాన్ని కూడా వాన్స్ మోదీకి సూచించారు.
ఈ కాల్ తర్వాత, రూబియోతో సహా విదేశాంగ శాఖ అధికారులు భారత్, పాకిస్తాన్లోని తమ ప్రతినిధులతో రాత్రంతా ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వం ఒప్పందం రూపకల్పనలో పాల్గొనలేదు. రెండు దేశాలను చర్చలకు తీసుకురావడంలోనే వారి పాత్ర పరిమితమైంది.