
Telangana Municipal Elections Results 2026 : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయినట్లే. అన్ని మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు పూర్తయి పలితాలు కూడా వెలువడ్డాయి.. కొన్ని కార్పోరేషన్లలో మాత్రం లెక్కింపు కొనసాగుతోంది. అత్యధిక మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకోగా... బిఆర్ఎస్ కూడా మంచి ఓటుబ్యాంకు, మున్సిపాలిటీలను సాధించింది. బిజెపి కూడా రెండు కార్పోరేషన్లలో సత్తా చాటింది.
తెలంగాణలోని మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్లలో ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీల్లో 2581 వార్డులకు గాను కాంగ్రెస్ అత్యధికంగా 1300 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్ఎస్ 700కు పైగా, బిజెపి 250 కి పైగా, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్స్ మరో 240కి పైగా వార్డుల్లో విజయం సాధించాయి. మొత్తంగా 70-80 మున్సిపాలిటీలకు కాంగ్రెస్, 20-30 బిఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కార్పోరేషన్ల విషయానికి వస్తే 414 వార్డుల్లో కాంగ్రెస్ 165పైగా స్థానాల్లో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానంలో బిజెపి ఉంది... ఈ పార్టీ 70కి పైగా వార్డులను గెలుచుకుంది. బిఆర్ఎస్ మాత్రం కేవలం 55 వార్డులకు పరిమితం అయ్యింది. అయితే అన్ని మున్సిపల్ కార్పోరేషన్లలో ఇంకా ఓట్లలెక్కింపు కొనసాగెతోంది... కానీ గెలుపుపై ఓ క్లారిటీ మాత్రం వచ్చేసింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పోరేషన్లలో బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మిగతా ఐదు కార్పోరేషన్లలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది... బిఆర్ఎస్ కు ఏ ఒక్కటీ దక్కేలా కనిపించడంలేదు.
ఇలా మొత్తంగా చూసుకుంటే మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ vs బిఆర్ఎస్… కార్పోరేషన్లలో కాంగ్రెస్ vs బిజెపి vs బిఆర్ఎస్ అన్నట్లుగా పోటీ సాగింది. ఈ పలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగానే ఉన్నాయి... కానీ సంతృప్తికరంగా మాత్రం లేవు. సాధారణంగా ఇలాంటి ఎన్నికల్లో అధికారపార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది... కానీ కాంగ్రెస్ ఆస్థాయి విజయం సాధించలేదనే చెప్పాలి. చాలా మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితి ఉంది... ఇక్కడ స్వతంత్రులు, ఇతర పార్టీలతో కలిపి కాంగ్రెస్ పాలకవర్గాన్ని ఏర్పాటుచేయవచ్చు. కానీ నైతికంగా మాత్రం ఓడిపోయినట్లే.
అధికార పార్టీని ఎదిరించి అద్భుతమైన పలితాలను సాధించామని బిఆర్ఎస్ చెబుతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలవవచ్చు... కానీ తాము గట్టి పోటీ ఇచ్చామని, చాలాచోట్ల ఓడినా గెలిచినట్లే అని బిఆర్ఎస్ చెబుతోంది. ఈ పలితాలు తమకు మరింత బూస్ట్ ఇచ్చాయని.. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను బైటపెట్టాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. రాబోయే జిహెచ్ఎంసితో పాటు ఇతర ఎన్నికల్లోనూ ప్రజలు బిఆర్ఎస్ వైపు నిలబడతారని ఈ పలితాలు స్పష్టం చేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బిజెపి కూడా రెండు కార్పోరేషన్లను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం మోదీ హవాలో ఓట్లు, సీట్లు సాధించారని ఆరోపించేవారికి ఈ పలితంతో సమాధానం చెప్పారు బిజెపి నాయకులు. కేంద్ర బండి సంజయ్ కరీంనగర్ లో, ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ లో సత్తా చాటారు. మున్సిపాలిటీల్లో కూడా బిజెపికి గౌరవప్రదమైన విజయమే దక్కింది. భవిష్యత్ లో తెలంగాణపై ఫోకస్ పెట్టేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయి.
ఆసక్తికర పరిణామం ఏంటంటే బిఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురయ్యాక కవిత మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ తరపున అభ్యర్థులను పోటీలో నిలిపారు. అనూహ్యంగా ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో పాటు పలు వార్డుల్లో విజయం సాధించారు. ఇలా ఈ మున్సిపల్ ఎన్నికల ద్వారా కవిత కూడా బలనిరూపణ చేసుకున్నారు. ఈ పలితాల ఊపుతో ఆమె దూసుకుపోనున్నారు.
ఇలా తెలంగాణ మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల పలితాలు అన్ని పార్టీల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. ఎవరిదీ స్పష్టమైన ఆధిక్యం కాదు... అలాగని ఎవరూ నిరూత్సాహపడే స్థాయిలో రిజల్ట్ రాలేదు. నొప్పించక తానొవ్వక అన్నట్లుగా ఈ మున్సిపల్ ఎన్నికల పలితాలున్నాయి. ఈ పలితాల ప్రభావం కచ్చితంగా భవిష్యత్ రాజకీయాలపై ఉంటుంది... అది ఎలాగన్నది ఇప్పుడే చెప్పలేం. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిల రాజకీయ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.