Telangana municipal elections results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ పలు మున్సిపాలిటీల్లో ఆధిక్యం సాధిస్తోంది. ఈ పరిణామాల మధ్య జనసేన పార్టీ తెలంగాణలో తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎక్కువ ప్రాంతాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ కొన్ని పట్టణాల్లో పోటీగా నిలుస్తుండగా, బీజేపీ కూడా కొన్ని వార్డుల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. మొత్తంగా చూస్తే అధికార పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
24
నేరేడుచర్లలో జనసేన తొలి విజయం
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. మొత్తం 15 వార్డుల్లో 9 వార్డులు కాంగ్రెస్, 5 వార్డులు బీఆర్ఎస్ దక్కించుకోగా, 14వ వార్డును జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి గెలుచుకున్నారు. ఆమెకు 60 ఓట్ల మెజారిటీ లభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన అధ్యక్షుడు సరికొప్పుల నాగేశ్వరరావు సతీమణిగా ఆమె గుర్తింపు పొందారు. ఈ విజయం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
34
336 స్థానాల్లో పోటీ.. చివరికి బోణీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన మొత్తం 336 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. అనేక ప్రాంతాల్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, నేరేడుచర్లలో వచ్చిన విజయం ఆ పార్టీకి ప్రాముఖ్యతను తెచ్చింది. తొలి కౌన్సిలర్ విజయంతో పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ఫలితాన్ని సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.
ఈ ఎన్నికల ముందు జనసేన పాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని ప్రకటించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆయన మద్ధతు కోరింది. అయితే అనివార్య కారణాలతో ప్రచార కార్యక్రమం రద్దు కావడంతో జనసేన, బీజేపీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొంది.
భవిష్యత్తుపై దృష్టి
జనసేన తొలి విజయంపై పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి స్పందించారు. సోషల్ మీడియా లో ఆరూరి విజయలక్ష్మికి అభినందనలు తెలిపారు. మహిళా దినోత్సవం సమీపంలో మహిళా అభ్యర్థి ద్వారా తొలి విజయం రావడం గర్వకారణమన్నారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత కృషి చేసి రాష్ట్రంలో పార్టీ స్థాయిని పెంచాలని పిలుపునిచ్చారు.