
కొత్త వేతనాల విధానంలో కార్మికులను వారి పని నైపుణ్యాన్ని బట్టి నాలుగు విభాగాలుగా వర్గీకరించినట్లు మంత్రి తెలిపారు. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కేటగిరీలుగా కార్మికులను గుర్తించారు. వేతనాల నిర్ణయంలో ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం తెలంగాణను మూడు జోన్లుగా విభజించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధులను జోన్-1, మున్సిపాలిటీలను జోన్-2, గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలను జోన్-3గా వర్గీకరించారు. ఈ విధానం ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జీవన వ్యయం, పని పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాలను నిర్ణయించే అవకాశం ఏర్పడిందని ప్రభుత్వం చెబుతోంది.
కొత్త వేతనాల సవరణలో భాగంగా కోర్ ఏరియాలో గతంలో రూ.10,900గా ఉన్న కనీస వేతనాన్ని రూ.14,000కు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. జోన్-2 పరిధిలో కనీస వేతనం రూ.15,000, జోన్-1లో రూ.16,000గా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వృత్తులు, పనుల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని మొత్తం 73 కేటగిరీలుగా విభజించి కొత్త వేతనాలను వర్తింపజేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. స్కిల్డ్ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన వేతన విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు సంబంధించిన వేతన వివరాలు కార్మిక శాఖ జారీ చేసిన జీఓ నంబర్ 6లో పొందుపరిచినట్లు మంత్రి తెలిపారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస వేతనాలను సవరించడంలో తగిన చర్యలు తీసుకోలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. నిబంధనల ప్రకారం నిర్దిష్ట కాల వ్యవధిలో కనీస వేతనాలను సమీక్షించి సవరించాల్సి ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్లలేదని అన్నారు. కార్మికుల వేతనాలపై ప్రభావం చూపే డీఏలోని వివిధ అంశాల్లో మార్పులు చేయడం మినహా కనీస వేతనాల సమగ్ర సవరణ జరగలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై ప్రక్రియను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ముందుగా సంబంధిత నోటిఫికేషన్లు జారీ చేసి కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. బోర్డు సిఫారసులను పరిశీలించిన అనంతరం 2025 జూన్ 27న క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేసి తదుపరి ప్రక్రియను కొనసాగించినట్లు చెప్పారు.
కనీస వేతనాల ఖరారులో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. పరిశ్రమల ప్రతినిధులు, CIIతో పాటు వివిధ పారిశ్రామిక సంస్థలతో చర్చలు నిర్వహించినట్లు చెప్పారు. కార్మిక సంఘాలు, కార్మికుల అభిప్రాయాలను కూడా తీసుకున్నామని వివరించారు. అన్ని వర్గాల సూచనలను పరిశీలించిన తర్వాతే కొత్త వేతనాలను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. సవరించిన కనీస వేతనాలు సుమారు 1.10 కోట్ల మంది కార్మికులకు వర్తిస్తాయని తెలిపారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కొత్త కనీస వేతనాలు వర్తించేలా ప్రత్యేక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఒకసారి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కార్మికుడికి హక్కుగా మారుతుందని స్పష్టం చేశారు.
కొత్త కనీస వేతనాలు అమల్లోకి వచ్చిన తర్వాత సంస్థలు, యాజమాన్యాలు వాటిని తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. చట్టబద్ధంగా నిర్ణయించిన వేతనాల కంటే తక్కువ చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇప్పటికే పెంచిన వేతనాలను తిరిగి తగ్గించడం కార్మికుల ప్రయోజనాలకు వ్యతిరేకమని అన్నారు.
కొన్ని మున్సిపాలిటీలు, సంస్థల్లో సవరించిన వేతనాలు అమలు కావడం లేదన్న సభ్యుల ప్రశ్నలకు మంత్రి స్పందించారు. అలాంటి సంస్థల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే కార్మిక శాఖ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇక్రిసాట్లోని కార్మికుల సమస్యల పరిష్కారానికి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. డీమార్ట్లో కనీస వేతనాలు అమలు కావడం లేదన్న ఫిర్యాదులపై నోటీసులు జారీ చేసి, సవరించిన వేతనాలను అమలు చేయించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కనీస వేతనాల విషయంలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి సభ్యులను కోరారు. కార్మికులకు చట్టబద్ధంగా అందాల్సిన వేతనాలు అందేలా కార్మిక శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తుందని వివేక్ వెంకటస్వామి తెలిపారు.