Telangana: అత్తామామల వేధింపులు తాళలేక మహిళలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూసి ఉంటాం. కానీ తాజాగా భార్య, అత్త వేధింపులు భరించలేని ఓ వ్యక్తి తనువు చాలించాడు. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కుటుంబ కలహాలు మరో ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. భార్య, అత్తమామలతో నెలల తరబడి సాగిన వివాదాల అనంతరం ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబం చేసిన ఆరోపణలతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
25
మూడు సంవత్సరాల దాంపత్య జీవితం..
హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన హరిప్రసాద్ (32)కు పూజతో 2022లో వివాహమైంది. కూతురు పుట్టినా వారి దాంపత్య జీవితం సజావుగా సాగలేదు. పూజ, ఆమె తల్లిదండ్రులు వేరు కాపురం పెట్టాలని నిరంతరం ఒత్తిడి చేయడంతో ఇంట్లో తరచూ వాదోపవాదాలు జరిగేవని హరిప్రసాద్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
35
పంచాయితీలో అవమానంతో మానసిక ఒత్తిడి
దంపతుల మధ్య గొడవలు పెరుగుతుండటంతో ఈ నెల 2న పెద్దల సమక్షంలో పంచాయితీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా హరిప్రసాద్ను అవమానించారని, పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని రెచ్చగొట్టారని కుటుంబం ఆరోపించింది. పంచాయితీ ముగిసిన వెంటనే పూజ కూతురుతో కలిసి వెల్దుర్తిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇది హరిప్రసాద్ను మరింత మానసికంగా కుంగదీసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఒత్తిడి భరించలేని హరిప్రసాద్ ఈ నెల 18న వెల్దుర్తిలో అత్తారింటి ముందు పురుగుల మందు తాగాడు. అక్కడున్న వారు వెంటనే గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగినా, అతడి ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.
55
చికిత్స పొందుతూ చివరి శ్వాస
వారంరోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న హరిప్రసాద్ మంగళవారం మరణించాడు. తన కుమారుడి మరణానికి పూజతో పాటు అత్తమామలు వరలక్ష్మి, కిషన్ బంధువులు రామాంజనేయులు, కిరణ్, శ్రీవాణి కారణమని మృతుడి తండ్రి మల్లేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.