హైదరాబాద్ మ్యాప్ మారిపోతోంది ! తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు

Published : Nov 25, 2025, 10:12 PM IST

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ జీహెచ్ఎంసీ భారీ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 27 మున్సిపాలిటీల విలీనం, కొత్త డిస్కం ఏర్పాటు, సోలార్, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు అనుమతి వంటి కీలక నిర్ణయాలను కేబినెట్ తీసుకుంది.

PREV
15
జీహెచ్ఎంసీ చరిత్రలో అతిపెద్ద విస్తరణకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో కీలక మలుపుగా నిలిచే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నాలుగు గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ఆమోదం తెలిపింది.

ఈ నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాదు పరిమితి భారీగా పెరగనుంది. కొత్తగా విలీనం కానున్న ప్రాంతాల్లో పెద్ద అంబర్‌పేట, మణికొండ, నార్సింగి, తుక్కుగూడ, మేడ్చల్, బోడుప్పల్, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్ వంటి వేగంగా పెరుగుతున్న పట్టణాలు ఉన్నాయి.

విలీనంతో ఈ ప్రాంతాలకు మరింతగా నిధులు, మెరుగైన రోడ్లు, నీటి సరఫరా, మురికివాడల నివారణ, విద్యుత్ వంటి పౌర సేవలు అందే అవకాశాలు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

25
విద్యుత్ రంగ పునర్‌వ్యవస్థీకరణ.. కొత్త డిస్కం ఏర్పాటు

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, డిస్కంలపై పేరుకుపోయిన భారీ నష్టాలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న TSSPDCL, TSNPDCLతో పాటు మూడో డిస్కంని ఏర్పాటు చేయనుంది.

కొత్త డిస్కం పరిధిలోకి మిషన్ భగీరథ, తెలంగాణ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రత్యేక వ్యవసాయ కనెక్షన్లు వంటివి చేరనున్నాయి.

అయితే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రస్తుత డిస్కంల పరిధిలోనే కొనసాగుతాయని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

35
సోలార్, పంప్డ్ స్టోరేజ్, థర్మల్ రంగాల్లో భారీ ప్రణాళికలు

రాష్ట్ర విద్యుత్ అవసరాలను రాబోయే పదేళ్లలో తీర్చేందుకు కేబినెట్ పలు వ్యూహాత్మక ఆమోదాలు తెలిపింది. 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు టెండర్లు త్వరలో ఆహ్వానించనున్నారు. 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కోసం పెట్టుబడిదారులకు ఆహ్వానం ఇస్తారు. రామగుండంలో 800 మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంట్‌ను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించడానికి ఆమోదం ఇచ్చింది.

పాల్వంచ, మక్తల్ ప్రాంతాల్లో కొత్త ప్లాంట్ల అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలించనుంది. కొత్త పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్‌ను స్వయంగా సొంతంగా ఉత్పత్తి చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం పరిశ్రమ రంగానికి పెద్ద ఊతం కానుంది.

45
హైదరాబాద్‌కు ఫుల్ అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్

వర్షాలు, గాలివానలు, చెట్లు కూలిపోవడం, షార్ట్‌సర్క్యూట్ కారణంగా తరచూ జరిగే విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తిస్థాయి అండర్‌గ్రౌండ్ విద్యుత్ కేబుల్స్ వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మెగా ప్రాజెక్ట్ ఖర్చు రూ. 14,725 కోట్లుగా అంచనా వేసింది.

హైదరాబాద్‌ను మూడు సర్కిళ్లుగా విభజించి దశలవారీగా ఈ ప్రాజెక్ట్ అమలు చేయనుంది. టీఫైబర్, ఇతర కమ్యూనికేషన్ కేబుళ్లను కూడా భూగర్భ మార్గంలోకి మార్చడం వల్ల నగరంలో రహదారులు, ఫుట్‌పాత్‌లు శుభ్రంగా ఉండే అవకాశం ఉంది.

55
విద్య, క్రీడా రంగాలకు కొత్త ప్రోత్సాహం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవెల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాలు కేటాయించారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో స్పోర్ట్స్ స్కూల్ కోసం 40 ఎకరాల భూమికి అనుమతి ఇచ్చారు. అలాగే జూబ్లీ హిల్స్‌తో పాటు ఆరు ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories