Telangana: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్ట్ స్టే విధించిన విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు విధించిన స్టేపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
25
హై కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ..
హైకోర్టు ఇచ్చిన స్టే నిర్ణయాన్ని సవాలు చేస్తూ, ఎన్నికల ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరనుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ దశలో హైకోర్టు జోక్యం అనవసరమని రాష్ట్రం వాదించనుంది. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, జీవో 9 చట్టబద్ధమని, దానిని అమలు చేయడమే ప్రజాస్వామ్యపరమైన నిర్ణయం అని స్పష్టంగా చెబుతోంది.
35
రేవంత్ రెడ్డి నేతృత్వంలో వ్యూహాత్మక సమావేశం
సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కూడా పాల్గొన్నారు. ఆయన హైకోర్టులో ఇప్పటికే ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. సమావేశంలో తదుపరి న్యాయపరమైన చర్యలపై స్పష్టమైన వ్యూహం రూపొందించారు.
బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నది ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తెలిపారు. 42 శాతం రిజర్వేషన్పై ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. రిజర్వేషన్ల వ్యవహారం తేలే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోమని ఇప్పటికే మంత్రులు తెలిపారు.
55
హైకోర్టు సూచన, ఎన్నికల సంఘం ఆందోళన
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించకూడదని హైకోర్టు గుర్తుచేసింది. జీవో 9పై మాత్రమే స్టే ఇచ్చిన హైకోర్టు, రిజర్వేషన్ శాతం పరిమితిపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇదే సమయంలో, వచ్చే వారం జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.