BJP: బీఆర్ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్ధులను ప్రకటించాయి. ఇక ఇప్పుడు బీజేపీ వంతు. జూబ్లీ హిల్స్ బై పోల్ అభ్యర్ధిగా ఆ పార్టీ ఎవరిని ప్రకటిస్తుంది అనే దానిపై ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఈ వారంలోగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్.. జూబ్లీహిల్స్ బైపోల్కు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. ఇప్పుడు అందరి చూపు బీజేపీ వైపు ఉంది. జూబ్లీహిల్స్ అభ్యర్ధిగా ఎవరిని ప్రకటిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంచితే.. ఇప్పటికే అభ్యర్ధి ఎంపిక తుదిదశకు చేరినట్టు తెలుస్తోంది. ఆరుగురు పోటీదారులున్న జాబితాను రూపొందించిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర నాయకత్వానికి షార్ట్లిస్టును సమర్పించనుంది.
25
ఆరుగురు పోటీదారులు.. త్వరలోనే అభ్యర్ధి ఎంపికపై ప్రకటన..
ఈలోగా ఆయా పోటీదారుల అనుభవం, నేపధ్యం, ఓటర్లతో కనెక్ట్ అయ్యే సామర్ధ్యాలపై ముగ్గురు సభ్యుల కమిటీ మేధోమదనం చేయనుంది. ఆ షార్ట్ లిస్టు రాష్ట్ర నాయకత్వానికి అందిన తర్వాత కేంద్ర నాయకత్వంతో ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఏది ఏమైనా అభ్యర్ధి ఎంపికపై కేంద్ర నాయకత్వానిది తుది నిర్ణయం అవుతుంది.
35
పోటీలో నలుగురు మహిళలు..
లంకల దీపక్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ, జూటూరు కీర్తి రెడ్డి, ఆకుల విజయ, పద్మ, మాధవీలత పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఈ లిస్టులో నలుగురు మహిళలు పోటీలో ఉండటం గమనార్హం. ఈ జాబితాను కేంద్ర నాయకత్వం మూడు పేర్లకు కుదిస్తుందని.. ఆ తర్వాత రాష్ట్ర నాయకత్వం అభ్యర్ధిని ఖరారు చేసి.. మళ్లీ కేంద్ర పెద్దల అనుమతికి పంపుతుందని సమాచారం.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ఎంపీ సీటు అభ్యర్థి మాధవీలత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లను విమర్శించిన ఆమె.. 'వారి పరిపాలన రాష్ట్రాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసిందని.. ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని' తెలిపారు. 'రాష్ట్రంలో మార్పు అవసరం. ప్రజలకు ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ బీజేపీ' అని అన్నారు. అలాగే నామినేషన్ కోసం తాను సీనియర్ నాయకులను సైతం సంప్రదించినట్టు పేర్కొన్నారు.
55
ఈ వారంలో ప్రకటన వచ్చే ఛాన్స్.?
మరోవైపు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్తో జరగాల్సిన సమావేశం రద్దు అయింది. పశ్చిమ బెంగాల్లో పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన విషయాల నేపధ్యంలో ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది. దీంతో ఈ వారంలోగా బీజేపీ తమ అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.