
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. స్పీకర్ పదవికి ఉన్న గౌరవం, శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అధికారపక్ష సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటనను కేవలం వ్యక్తిగత వివాదంగా చూడకుండా సభా మర్యాదలకు సంబంధించిన అంశంగా చూడాలని వారు స్పష్టం చేశారు. తీర్మానం కాపీని శాసన మండలి చైర్మన్కు పంపించి, అక్కడి నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలపై తగిన చర్యలు తీసుకునేలా ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు.
స్పీకర్పై జరిగిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని అధికారపక్షం డిమాండ్ చేసింది. బీఆర్ఎస్ సభ్యుల వ్యవహారంపై పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. స్పీకర్ను అవమానించడం అంటే ఒక్క వ్యక్తిని అవమానించడం కాదని, శాసనసభ వ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సభాపతి స్థానానికి ప్రత్యేక గౌరవం ఉంటుందని చెప్పారు. మరోవైపు, సభలో మాట్లాడిన పలువురు సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సభా సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదని మంత్రి సీతక్క సహా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో భావోద్వేగ పరిస్థితి నెలకొంది. మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.స్పీకర్ను ఉద్దేశించి సీతక్క తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తల్లిని అవమానించే స్థాయికి రాజకీయ భాష దిగజారడం బాధాకరం అని ఆమె అన్నారు. అట్టడుగు వర్గాల నుంచి ఎదిగి కీలక పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. సోమవారం జరిగిన పరిణామాలతో తాను తీవ్రంగా బాధపడ్డానని స్పీకర్ ఇప్పటికే వెల్లడించారు. సభలో సీతక్క భావోద్వేగానికి గురైన సమయంలో తాను కూడా తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయానని ఆయన చెప్పారు.
మరోవైపు బీఆర్ఎస్ ఈ వ్యవహారంపై భిన్నమైన వాదనను వినిపించింది. సోమవారం అసెంబ్లీ ప్రాంగణం వద్ద తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరును ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. సభ ప్రారంభమైన వెంటనే హరీశ్రావు సోమవారం చోటుచేసుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ, వివాదానికి కారణమైన వ్యాఖ్యలు తన తల్లిని ఉద్దేశించే చేశారనే విషయాన్ని ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే తాతా మధు మాత్రం తాను స్పీకర్ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. పోలీసుల తీరుపైనే తాను ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పారు. తనకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై గౌరవం ఉందని వెల్లడించారు. అయితే వివాదం మరింత ముదరడంతో పోలీసులు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.