Oyo: ప్రముఖ హాస్పటిలాటీ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారాన్ని విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పలు పట్టణాల్లో హోటల్స్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
దేశవ్యాప్తంగా బడ్జెట్ హోటల్ రంగంలో గుర్తింపు పొందిన ఓయో రూమ్స్ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే అనేక హోటళ్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ, రెండు రాష్ట్రాల్లో కలిపి మరో 300 కంపెనీ సర్వీస్డ్ హోటళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు, పెరుగుతున్న పర్యాటక అవసరాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
25
టియర్-2, టియర్-3 నగరాలపై ఫోకస్
హైదరాబాద్ వంటి ప్రధాన నగరంతో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ విస్తరణ చేపట్టాలని సంస్థ నిర్ణయించింది. వ్యాపార కార్యకలాపాలు పెరుగుతున్న నగరాల్లో స్థిరమైన డిమాండ్ కనిపిస్తోందని సంస్థ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ప్రీమియం విభాగాన్ని బలోపేతం చేయాలని యోచిస్తోంది. మెరుగైన రవాణా సదుపాయాలు, విమాన కనెక్టివిటీ, పారిశ్రామిక వృద్ధి ఈ ప్రాంతాలను హాస్పిటాలిటీ రంగానికి ఆకర్షణీయంగా మార్చాయి.
35
ఆధ్యాత్మిక, మెడికల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి
తెలంగాణలో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ప్రాంతాలకు భక్తుల రాక గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక కేంద్రాల చుట్టుపక్కల సర్వీస్డ్ హోటళ్లను పెంచాలని సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్లో మెడికల్ టూరిజం వేగంగా విస్తరిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులు, ఐటీ రంగం విస్తరణ వల్ల దేశం నలుమూలల నుంచి ప్రయాణికులు వస్తున్నారు. ఈ డిమాండ్ను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా ఓయో తన నెట్వర్క్ను విస్తరించుతోంది.
కొత్తగా ప్రారంభించనున్న హోటళ్లను ప్యాలెట్, సండే, టౌన్ హౌస్ వంటి ప్రీమియం బ్రాండ్ మోడళ్ల ద్వారా నిర్వహించనున్నారు. సాధారణ బడ్జెట్ వసతులతో పాటు మెరుగైన గదులు, ప్రామాణిక సేవలు, డిజిటల్ బుకింగ్ సౌకర్యం అందించడంపై దృష్టి పెట్టారు. సంస్థ భాగస్వామ్య హోటళ్లకు నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక మద్ధతు, మార్కెటింగ్ సహాయం అందిస్తోందని నిర్వాహకులు తెలిపారు. సరఫరా పెంపుతో పాటు సేవల స్థిరత్వాన్ని కాపాడటం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.
55
ఐపీఓ దిశగా అడుగులు..
2013లో రితేశ్ అగర్వాల్ స్థాపించిన ఈ సంస్థ ప్రస్తుతం 80కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వేలాది హోటళ్లతో బలమైన నెట్వర్క్ కలిగి ఉంది. ఇప్పుడు సంస్థ పబ్లిక్ మార్కెట్లోకి రావడానికి సన్నద్ధమవుతోంది. సుమారు రూ. 6,650 కోట్ల నిధులు సమీకరించాలనే లక్ష్యంతో సెబీవద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేసినట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న ఈ భారీ విస్తరణ సంస్థ మార్కెట్ స్థాయిని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెరుగుతున్న దేశీయ పర్యాటక ప్రవాహం దృష్ట్యా హాస్పిటాలిటీ రంగానికి ఇది కీలక దశగా మారనుంది.