New year: కొత్తేడాదికి వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు బార్లు, రెస్టారెంట్లు సైతం ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు.
డిసెంబర్ 31 రాత్రి, జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలనుకునే స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు తప్పనిసరిగా 15 రోజుల ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. వేడుకలకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, శాంతిభద్రతలు దెబ్బతినకుండా నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.
25
కార్యక్రమాల నిర్వహణకు కీలక నిబంధనలు
వేడుకలు జరిగే ప్రదేశంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ పేర్కొన్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అతిథుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం తగిన సిబ్బంది ఉండాలని సూచించారు. అశ్లీల నృత్యాలు, అసభ్య ప్రదర్శనలు పూర్తిగా నిషేధం అని, బాణసంచా వినియోగానికి ఎలాంటి అనుమతి లేదని తేల్చి చెప్పారు. సరిపడా పార్కింగ్ సదుపాయం కల్పించాలని, కెపాసిటీని మించి పాస్లు ఇవ్వకూడదని తేల్చి చెప్పారు.
35
శబ్ద కాలుష్యంపై కఠిన నియంత్రణ
శబ్ద నియంత్రణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీస్ శాఖ స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లు, డీజే సిస్టమ్లు రాత్రి 10 గంటలకే ఆపాలని సూచించారు. ఇండోర్ కార్యక్రమాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ దాటకూడదని ఆదేశించారు.
పబ్లు, బార్లలో మైనర్లకు అనుమతి ఉండదని సీపీ హెచ్చరించారు. మత్తుపదార్థాల విక్రయం లేదా వినియోగం చేస్తే కేసులు తప్పవని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వాహనం పోలీస్ స్టేషన్కు తరలిస్తామని, రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే తాగి వాహనం నడిపితే మూడు నెలలు లేదా పూర్తిగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుందని చెప్పుకొచ్చారు. ఇక మైనర్లు వాహనాలు నడిపితే వాహన యజమానిదే పూర్తి బాధ్యత అని తేల్చి చెప్పారు.
55
వేడుకల అనంతరం భద్రతకు ప్రత్యేక చర్యలు
వేడుకలు ముగిసిన తర్వాత కూడా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు సూచించారు. పబ్, బార్ నిర్వాహకులు కస్టమర్లను సురక్షితంగా ఇంటికి చేరేలా క్యాబ్స్ లేదా డ్రైవర్లను ఏర్పాటు చేయాలన్నారు. నగరవ్యాప్తంగా షీటీమ్స్ నిఘా కొనసాగుతుందని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.