హైదరాబాద్ లాంటి మహా నగరంలో జీవించడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. హోటల్లో భోజనం చేయాలంటే కనీసం రూ. 100 చెల్లించాల్సిందే. ఇలాంటి తరుణంలో జీహెచ్ఎంసీ అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుతో రూ. 5కే భోజనం అందిస్తోన్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లను “ఇందిరమ్మ క్యాంటీన్లు”గా విస్తరిస్తూ, ఇకపై ఉదయాన్నే నాణ్యమైన మిల్లెట్ టిఫిన్లు అందించనున్నట్లు ప్రకటించింది. భోజనంతో పాటు టిఫిన్ను కూడా తక్కువ ధరకు అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
25
రూ. 5కే టిఫిన్
GHMC ప్రకటించిన ప్రకారం, త్వరలో నగరవ్యాప్తంగా ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. ఈ క్యాంటీన్లలో ఉదయం 7 నుంచి 10 గంటల మధ్య ఇడ్లీ, ఉప్మా, పూరీ వంటి టిఫిన్లు కేవలం రూ.5కే అందించనున్నారు.
ఇప్పటికే మధ్యాహ్నం భోజనాన్ని రూ.5కే అందిస్తున్న జీహెచ్ఎంసీ ఇప్పుడు అల్పాహారం కూడా అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. కార్మికులు, నిరుద్యోగులు, చిరు ఉద్యోగులు, విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
35
139 కొత్త క్యాంటీన్ల కోసం రూ.11.43 కోట్ల వ్యయం
ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు కోసం జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం 139 ప్రాంతాల్లో కొత్త కంటైనర్ క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం రూ.11.43 కోట్లు కేటాయించారు. ఈ క్యాంటీన్లు ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. శుభ్రతతో పాటు అన్ని రకాల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం జీహెచ్ఎంసీ అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని రూ.27.50 వ్యయంతో తయారు చేస్తున్నారు. ఇందులో రూ.22.50ను GHMC భరిస్తూ, ప్రజల నుంచి కేవలం రూ.5 మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇదే విధంగా, ఉదయాన్నే టిఫిన్ కూడా రూ.5కే అందించాలన్న నిర్ణయం ఇప్పుడు అమలులోకి రానుంది. అంటే ఒక వ్యక్తి ఓరోజు రెండు సార్లు కడుపు నింపుకోవాలంటే కేవలం రూ.10 ఉంటే చాలన్నమాట.
55
ప్రజల నుంచి ప్రశంసలు
సాధారణంగా ఒక సాధారణ హోటల్లో టిపిన్ చేయాలన్నా కనీసం రూ. 30 చెల్లించాల్సిందే. అదే భోజనం అయితే తక్కువలో తక్కువ రూ. 50 నుంచి రూ. 70 పెట్టాల్సిందే. జీహెచ్ఎంసీ తీసుకొచ్చిన ఈ క్యాంటీన్ల సహాయంతో కేవలం రూ. 10తోనే టిఫిన్, లంచ్ రెండూ పూర్తి చేసే అవకాశం లభించనుంది.
పేదలు, కార్మికులు, నగరంలో ఉంటూ కోచింగ్ సెంటర్స్లో శిక్షణ పొందుతోన్న విద్యార్థులు, నిరుద్యోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.