
Hyderabad Real Estate : నిజాంల నగరం హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ సిటీగా మారిపోయింది. ఓవైపు ఓల్డ్ సిటీ నగర చారిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిస్తే మరోవైపు ఐటీ సిటీ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ఇలా పాత కొత్తల కలయికతో హైదరాబాద్ నగరం ముందుకు సాగుతోంది... డెవలప్మెంట్ కు కొత్త అర్థం చెబుతోంది.
హైదరాబాద్ అభివృద్ధి గురించి తెలియాలంటే ఇక్కడి రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు కొండలు, గుట్టలతో బీడుభూమిగా ఉన్నప్రాంతం ఐటీ విప్లవంతో కోట్లకు పడగలెత్తింది. ఒకప్పుడు హైదరాబాద్ లో రిచ్చెస్ట్ ఏరియా అంటే బంజారాహిల్స్, జూబ్లిహిల్స్... కానీ ఇప్పుడు హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ, రాయదుర్గం వంటి ప్రాంతాలు వాటిని తలదన్నేలా మారాయి. ఇక్కడ భూముల ధరలు వందలు కోట్లు పలుకుతున్నాయి.
గతంలో హైదరాబాద్ శివారు కోకాపేట నియోపోలిస్ లో ఎకరా భూమి రూ.100 కోట్లు పలికితేనే అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత రాయదుర్గం నాలెజ్డ్ సిటీలో టిజిఐఐసి నిర్వహించిన ఈ-వేలంలో రికార్డు స్థాయిలో రూ.237 కోట్లకు ఎకరం పలికింది. ఈ ధర రియల్ ఎస్టేట్ పండితులనే అవాక్కయ్యేలా చేసింది. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఆల్ టైమ్ రికార్డును బద్దలుగొట్టేందుకు రంగం సిద్దం అవుతోంది... అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతంలో భూమిని అమ్మబోతోంది ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గం లోని ఐటిసి కోహినూర్ ఎదురుగా సర్వే నెంబర్ 83/1 లో గల 10.63 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టింది. ఇటీవల మే నెలలో ఈ ప్రాంతంలోని భూమిని ఎకరం కనీస ధర రూ.139 కోట్లకు వేలం పెడితే ఏకంగా రూ.237 కోట్లకు అమ్ముడుపోయింది. కాబట్టి ఈ నెలలో నిర్వహించే వేలంలో కనీస ధర రూ.175 కోట్లుగా నిర్ణయించింది టిజిఐఐసి. అయినా ఈ రాయదుర్గం భూమిని దక్కించుకునేందుకు పలు కంపెనీలు సిద్దంగా ఉన్నాయి... దీంతో ఈసారి ఆల్ టైమ్ రికార్డు ధర నమోదయ్యే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా.
గతవారం టి-హబ్ లో ప్రీ-బిడ్ సమావేశాన్ని నిర్వహించారు...ఇందులో ప్రధాన రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొన్నాయి. సుమధుర, గౌర్ వేంచర్స్, ఆర్ఎం, వంశీరామ్, సత్వా, ఎస్ అర్బన్, ఎల్&టి రియల్టీ, హెటిరో, శోభ, త్రిదాస, కల్పతరు, రామ్ జీ , గోద్రేజ్, ఎంఎస్ఎన్ వంటి కంపెనీలు హాజరయ్యారు. గతంలో వేలం కంటే ఎక్కువ కంపెనీలు ఈ భూములపై ఆసక్తి చూపుతుండటంతో రికార్డు ధర ఖాయంగా కనిపిస్తోంది.
రెండు ప్లాట్లు పక్కపక్కనే ఉండటంతో ఒకే కంపెనీ ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేసి సొంతం చేసుకునే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. అందుకే ఎకరం రూ.250 కోట్లకు పైగా పలకవచ్చని అంటున్నారు. ఈ 10 ఎకరాల వేలం ద్వారా రెండు వేల నుండి మూడు వేల కోట్ల వరకు సమకూరవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
రాయదుర్గంలోని 10 ఎకరాల భూమి వేలంపాట ఈ నెలలోనే జరగనుంది. రెండు విడతల్లో ఈ వేలం నిర్వహించనున్నారు... మొదట 5.25 ఎకరాల ప్లాట్ 1 ఈ-వేలం ఆగస్ట్ 21న (శుక్రవారం) నిర్వహించనున్నారు. ఇక 5.38 ఎకరాల ప్లాట్ 2 ఈ-వేలం ఆగస్ట్ 28 (శుక్రవారం) నిర్వహించనున్నారు. ఈ రెండు విడతల భూముల వేలంపాట ఎలా సాగుతుంది? ఎలాంటి రికార్డులు నమోదవుతాయో అని రియల్ ఎస్టేట్ రంగంలోని వారే కాదు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్ లో భూముల రికార్డు ధరలు డెవలపర్ల ప్రణాళికలను మార్చవచ్చు. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగి, తుది ధరలపై ప్రభావం చూపుతుంది. పెట్టుబడిదారులు ఇప్పుడు హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలోనే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. గృహ నిర్మాణ సంస్థలు వినూత్న వ్యాపార వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాలలో ఈ ప్రాంతంలో భారీ డెవలప్మెంట్లు రానున్నాయి. ఈ ధరల పెరుగుదల కొత్త పెట్టుబడులకు, భాగస్వామ్యాలకు దారితీయవచ్చు.
అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సామాన్యులకు ఈ ధరల పెరుగుదల ఒక సవాలుగా మారింది. ఒకప్పుడు మధ్యతరగతికి అందుబాటులో ఉన్న గృహాలు ఇప్పుడు కష్టంగా మారాయి. స్థలాల ధరలు పెరగడంతో అపార్ట్మెంట్లు, ఇళ్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ ఉద్యోగులు హైదరాబాద్లో ఇల్లు కొనడం దాదాపు కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం సరసమైన గృహాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే, భవిష్యత్తులో గృహనిర్మాణం మరింత భారం అవుతుంది.
రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ ధరల పెరుగుదలను జాగ్రత్తగా అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ వృద్ధి కొనసాగుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రికార్డు ధరలు దీర్ఘకాలికంగా నిలబడతాయా అనేది ప్రశ్న. మార్కెట్ స్థిరత్వం కోసం నియంత్రణలు అవసరం. కొంతమంది నిపుణులు ధరల సరళీకరణ లేదా స్థిరీకరణను ఆశిస్తున్నారు. నగరంలో ఐటీ, ఇతర రంగాల విస్తరణ డిమాండ్ను పెంచుతుంది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి మరింత అవసరం అని నిపుణులు నొక్కి చెబుతున్నారు.