Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు మరో కీలక అడుగు వేసింది. ఆహార పదార్థాలు, మందులు, కాస్మెటిక్స్ నాణ్యతను మరింత సమర్థంగా పర్యవేక్షించేందుకు తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్ర గ్స్ (TG SAFE) ఏర్పాటు చేసింది.
కొత్త వ్యవస్థలో ఆహార భద్రత, ఔషధాల నియంత్రణకు సంబంధించిన అన్ని కీలక బాధ్యతలు TG SAFE ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఆహార ఉత్పత్తులు, ఔషధాలు, కాస్మెటిక్స్కు లైసెన్సులు మంజూరు చేయడం నుంచి తనిఖీలు, నమూనాల సేకరణ, ప్రయోగశాల పరీక్షలు, నిబంధనల అమలు వరకు అన్ని ప్రక్రియలు సమన్వయంతో కొనసాగనున్నాయి. దీంతో రెండు శాఖల మధ్య సమన్వయం మెరుగుపడి, నిర్ణయాలు వేగంగా అమలయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
25
కల్తీ ఆహారం, నకిలీ మందులపై ప్రత్యేక నిఘా
రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ లేదా నాసిరకం మందులపై మరింత కఠినంగా వ్యవహరించేందుకు TG SAFE ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఇంటెలిజెన్స్ ఆధారిత సమాచారం సేకరణతో పాటు రిస్క్ ఆధారిత తనిఖీలను నిర్వహించనుంది. ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ నుంచి అవసరమైన సిబ్బందిని డీజీపీ కేటాయించనున్నారు. దీంతో అక్రమాలకు పాల్పడే వారిపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
35
ఒకే ల్యాబ్ వ్యవస్థ.. ఆధునిక పర్యవేక్షణ
ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న ఫుడ్ టెస్టింగ్, డ్ర గ్స్ టెస్టింగ్ ప్రయోగశాలలను ఒకే ల్యాబొరేటరీ వ్యవస్థ కిందకు తీసుకురానున్నారు. దీంతో నమూనాల పరీక్షలు వేగంగా పూర్తికావడంతో పాటు రిపోర్టుల్లో సమన్వయం పెరుగుతుంది. అలాగే డ్ర గ్స్ అడ్మినిస్ట్రేషన్, ఫుడ్ సేఫ్టీ, ఎన్ఫోర్స్మెంట్, లీగల్ అండ్ ప్రాసిక్యూషన్, ల్యాబొరేటరీ, అడ్మినిస్ట్రేషన్ వంటి ప్రత్యేక విభాగాలు TG SAFE పరిధిలో పనిచేయనున్నాయి. టెస్టింగ్, డేటా విశ్లేషణ, లీగల్ సపోర్ట్, ప్రయోగశాలల ఆధునీకరణ కోసం రాష్ట్రస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫార్మా కంపెనీలు, ఆహార ఉత్పత్తి సంస్థలు అధికంగా ఉన్న క్యూర్ (CURE) ప్రాంతంలో తొలి దశలో TG SAFE కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాంతంలో నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేసిన తర్వాత దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా సేవలను విస్తరించే అవకాశం ఉంది. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాల్లో వేగంగా స్పందించడంతో పాటు వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
55
TG SAFE కమిషనర్గా అవినాశ్ మొహంతి
TG SAFE తొలి కమిషనర్గా సీనియర్ అధికారి అవినాశ్ మొహంతిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన డ్ర గ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదనపు బాధ్యతగా TG SAFE కమిషనర్ పదవిని కూడా అప్పగించారు. ఫుడ్ సేఫ్టీ, డ్ర గ్స్ కంట్రోల్ విభాగాల పరిపాలనా బాధ్యతలు ఇకపై కమిషనర్ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి. ఈ నిర్ణయానికి సంబంధించి వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ 67 జారీ చేసింది. ఆగస్టు 15, 2026 నుంచి TG SAFE అధికారికంగా అమల్లోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.