Hyderabad: ఒకప్పుడు కూకట్పల్లి నగర శివారుల్లో ఉండేది. కానీ ప్రస్తుతం కూకట్పల్లి మిడిల్ ఆఫ్ ది సిటీగా మారింది. అయితే రానున్న రోజుల్లో హైదరాబాద్లోని మరో ప్రాంతం కూడా ఇలాగే అభివృద్ధి చెందనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
ఒకప్పుడు ఖాళీ ప్లాట్లతో మాత్రమే కనిపించిన శ్రీశైలం హైవే పరిసరాలు ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ ఇళ్లు భారీగా నిర్మాణంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి.
25
ఫ్యూచర్ సిటీ ప్రభావం
శ్రీశైలం హైవే సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి కొత్త ఊపిరి పోసింది. ఇప్పటికే ఒక వైపు హార్డ్వేర్ పార్క్, మరోవైపు ఫ్యాబ్ సిటీ, సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం వచ్చింది. ఫ్యూచర్ సిటీ పూర్తయిన తర్వాత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, వ్యాపార కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు.
35
ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం వరకు ఫోర్ లేన్ కనెక్టివిటీ
కొంగరాకలాన్ నుంచి అమంగల్ వరకు 41.5 కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ నిర్మాణం జరుగుతోంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ (ORR) ను రీజినల్ రింగ్ రోడ్ (RRR) తో కలుపుతుంది. ఈ ప్రాజెక్టును హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. అమంగల్ నుంచి ప్రతిపాదిత శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ వరకు నాలుగు లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి ప్రతిపాదనలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే తయారు చేసింది. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు నిరంతర ఫోర్ లేన్ ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వైపు ప్రయాణ దూరం తగ్గి సమయం ఆదా అవుతుంది.
ఇప్పటివరకు శ్రీశైలం హైవే ప్రాంతం ప్రధానంగా ఓపెన్ ప్లాట్లకు మాత్రమే ప్రసిద్ధి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. తుక్కుగూడ నుంచి కందుకూర్ వరకు, అమంగల్, కడ్తాల్ వరకు అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇండిపెండెంట్ హౌసులు నిర్మాణంలో ఉన్నాయి. సుమారు 120కి పైగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. పశ్చిమ హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ఇళ్ల ధరలు తక్కువగా ఉండటం మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షిస్తోంది.
ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్ ధరలు చదరపు అడుగుకు సుమారు రూ.4,500 నుంచి ప్రారంభం ఉన్నాయి. అంటే డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ సుమారు రూ. 55 లక్షల నుంచి మొదలవుతుంది. ఇక విల్లాల విషయానికొస్తే రూ.1.5 కోట్ల వరకు పలుకుతున్నాయి. ఆదిబట్లలో పనిచేస్తున్న ఐటీ, ఏరోస్పేస్ రంగాల ఉద్యోగులు కూడా ఈ ప్రాంతంలో ఇళ్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాలు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉండటం మరో ప్రయోజనం.
55
మధ్యతరగతికి అందుబాటులో
ఈ ప్రాంతంలో ప్లాట్ల ధరలు కూడా ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాయి. ప్రతి చదరపు గజానికి ధరలు తుక్కుగూడలో రూ. 25 వేల నుంచి రూ. 40 వేలలో అందుబాటులో ఉన్నాయి. ఇక కందుకూరులో రూ. 18 నుంచి రూ. 30 వేలలో అలాగే అమంగల్లో రూ. 15,000 నుంచి రూ. 28,000 మధ్యలో అందుబాటులో ఉన్నాయి. కృష్ణా జల సరఫరా, మంచి రహదారులు, అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల శ్రీశైలం హైవే పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వచ్చే రెండు సంవత్సరాల్లో ఈ ప్రాంతం ప్రధాన రెసిడెన్షియల్ హబ్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సూచనలు పాటించడమే ఉత్తమం.