
సోమవారం రాత్రి కూకట్పల్లి, కెపీహెచ్బీ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లలో కల్తీ కల్లు తాగిన ఘటనలో మొత్తం ఐదుగురు మరణించారు. మరో 31 మంది నిమ్స్, గాంధీ, రాందేవ్రావు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమందికి డయాలసిస్ అవసరమవగా, మరికొందరిని వెంటిలేటర్పై ఉంచారు.
ఈ కల్లు సేవించిన వారికి వాంతులు, గుండెలోదడ, వికారం వంటి లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో అసలు కల్తీ కల్లును ఎలా తయారు చేస్తారు.? దీంతో నష్టాలు ఏంటి.? కల్తీ కల్లును ఎలా గుర్తించాలి.? లాంటి వివరాలను తెలుసుకుందాం.
ఈ ఘటన తర్వాత ఎక్సైజ్ శాఖ, పోలీసులు కల్తీ కల్లు కేంద్రాలపై దాడులు నిర్వహించారు. ఇప్పటివరకు 5 కేసులు బాలానగర్ అబ్కారీ ఠాణాలో, 2 కేసులు కెపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. చింతకింది నగేష్ గౌడ్, బట్టి శ్రీనివాస్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, కె. కుమార్ గౌడ్, తీగల రమేష్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. కల్తీ కల్లు తయారీ కేంద్రాలను సీజ్ చేసి, 674 లీటర్ల మృత్యు మద్యం ధ్వంసం చేశారు.
మరోవైపు, ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ బాధితులను పరామర్శించారు. కల్తీ కల్లు సరఫరాకు సంబంధించి మద్యం డిపోలపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.
కల్తీ కల్లు అంటే సహజంగా తాటిచెట్టు నుంచి తీసే కల్లు కాదు. ఇది పూర్తిగా రసాయనాల మిశ్రమంతో తయారు చేసే కల్లు. అక్రమార్కులు ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రేట్, యాంటీ సైకోటిక్, నిమ్మ ఉప్పు, శాక్రీన్, కుంకుడు కాయల రసం, సిల్వర్ వైట్, యూరియా, సోడా యాష్, అమ్మోనియా, డ్రై ఈస్ట్ లాంటి పదార్థాలను మిశ్రమంగా కలిపి కల్లు రూపంలో తయారు చేస్తున్నారు.
డిమాండ్ తగినంత తాటి, ఈత చెట్లు లేకపోవడంతో పూర్తిగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. నిజామాబాద్లో ఒక్క రోజులోనే 3 లక్షలకు పైగా కల్తీ కల్లు ఉత్పత్తి అవుతోంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అక్కడ ఒక్క తాటిచెట్టు కూడా లేదు. 2,400 సీసాల కల్లు తయారీకి కేవలం రూ.7,800 మాత్రమే ఖర్చవుతుండడంతో అక్రమార్కులు కల్తీ కల్లు తయారీకి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
కృత్రిమ కల్లులో ఉండే రసాయనాలు మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఆల్ఫ్రాజోలం, ఇతర మత్తు ఔషధాల మోతాదు అధికమైతే, కిడ్నీలు, లివర్, నరాల వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. కల్తీ కల్లు తాగిన తర్వాత కనిపించే లక్షణాలు:
* వాంతులు
* వికారం
* తలనొప్పి
* శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
* స్పృహ కోలపోవడం
* కిడ్నీ ఫెయిల్యూర్తో పాటు తీవ్రమైన పరిస్థితుల్లో మరణం కూడా సంభవించవచ్చు
కల్తీ కల్లును కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాసన: సహజ కల్లు పుల్లగా వాసన వస్తుంది. అయితే కల్తీ కల్లులో అలాంటి వాసన ఉండదు. లేదా రసాయనాల వాసన ఎక్కువగా ఉంటుంది.
రంగు: సహజ కల్లు కొంచెం మసకబారిన తెలుపు రంగులో ఉంటుంది. కానీ కల్తీ కల్లు ఎక్కువగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది.
నురగ: కల్తీ కల్లులో కృత్రిమంగా నురగ వచ్చేలా తయారు చేస్తారు. నురగ ఎక్కువగా ఉంటే అందులో కుంకుడు కాయ రసం కలిపినట్లు అర్థం చేసుకోవాలి.
రుచి: కల్తీ కల్లు రుచి బాగా తియ్యంగా ఉంటుంది. దీనికి కారణం అందులో కలిపే శాక్రిన్. దీనివల్ల కల్లు తీపిగా మారుతుంది.
వికారం: తాగిన కొద్దిసేపటికే వికారం, వాంతులు వస్తే ఇది కల్తీ కల్లు అని భావించాలి.