
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. ముసురు వీడటం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మధ్య భారతదేశం మీదుగా పయనిస్తున్న ఈ అల్పపీడన వ్యవస్థ కారణంగా రాబోయే 24 గంటలు అత్యంత కీలకమని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తెలంగాణలో జూలై 31న కూడా వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, వాయువ్య తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
రెడ్ అలర్ట్ జిల్లాలు: ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది.
ఆరెంజ్/ఎల్లో అలర్ట్: నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు చెప్పారు.
హైదరాబాద్ పరిస్థితి: రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ వెలుగులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మధ్యాహ్నం నుంచి రాత్రి మధ్యలో విడతల వారీగా మోస్తరు జల్లులు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 26°C - 28°C వరకు నమోదు కావచ్చు.
విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్ మీదుగా కదులుతున్న వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్పై కూడా గట్టిగానే ఉంది. రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తా, మన్యం: పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమ: కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయి. తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
గత 48 గంటలుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది.
శ్రీశైలం ప్రాజెక్ట్: జూరాల పవర్ హౌస్, స్పిల్ వే గేట్ల ద్వారా శ్రీశైలం డ్యామ్లోకి 85,421 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. కేవలం ఒకటిన్నర రోజు వ్యవధిలోనే 4.67 టీఎంసీల నీరు చేరడంతో డ్యామ్ నీటిమట్టం 46.82 టీఎంసీలకు పెరిగింది. దీని పూర్తి సామర్థ్యం 215.8 టీఎంసీలు. రాబోయే మూడు రోజుల్లో మరో 25 టీఎంసీల వరకు నీరు వచ్చే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.
అత్యధిక వర్షపాతం: ఏపీలోని అల్లూరి జిల్లా కూనవరంలో అత్యధికంగా 28.6 మిమీ, అరకులో 28 మిమీ, కొమరాడలో 26 మిమీ వర్షపాతం నమోదైంది. శ్రీశైలంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యింది.
వర్ష తీవ్రత దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కంట్రోల్ రూమ్ల ఏర్పాటు: ప్రతి జిల్లా కేంద్రంలో అత్యవసర సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తెచ్చారు.
పర్యాటక ప్రాంతాలపై ఆంక్షలు: వాగులు, జలాశయాలు, వాటర్ ఫాల్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా డీజీపీ ఆదేశాల మేరకు 167 పర్యాటక ప్రాంతాలు, 249 ప్రమాదకర స్పాట్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెస్క్యూ టీమ్స్ సిద్ధం: సహాయక చర్యల కోసం 12 కంపెనీల ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను, రెస్క్యూ పరికరాలు, పడవలను సిద్ధంగా ఉంచారు.
ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, పాత భవనాలు, ఫ్లెక్సీ హోర్డింగ్స్ కింద నిలబడకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప లోతట్టు ప్రాంతాల ప్రజలు బయటకు రాకూడదని స్పష్టం చేశారు. ఆగస్టు 4 తర్వాత వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉనప్పటికీ, అప్పటివరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.