TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రయాణాన్ని ఇంటి గుమ్మం వరకు అనుసంధానించేలా త్వరలో ఎలక్ట్రిక్ ఆటో సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
బస్సు ప్రయాణంలో చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య బస్స్టాప్కు చేరుకోవడం లేదా బస్సు దిగిన తర్వాత చివరి గమ్యస్థానానికి వెళ్లడం. ఈ సమస్యను పరిష్కరించడానికే 'ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ' విధానాన్ని టీజీఎస్ఆర్టీసీ అమలు చేయాలని నిర్ణయించింది. ఇంటి నుంచి సమీప బస్స్టాప్ వరకు, అలాగే బస్స్టాప్ నుంచి గమ్యస్థానానికి ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో ప్రయాణం మరింత సులభంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
24
ఒకే బుకింగ్తో పూర్తి ప్రయాణం
ఈ కొత్త విధానంలో ప్రయాణికులకు అత్యంత ఉపయోగకరమైన అంశం ఏంటంటే.. బస్సు టికెట్ బుక్ చేసే సమయంలోనే ఎలక్ట్రిక్ ఆటో సేవను కూడా ఒకేసారి రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరుగా ఆటో కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. ఒకే బుకింగ్తో ఇంటి నుంచి బయలుదేరి చివరి గమ్యస్థానం వరకు మొత్తం ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు. దీని వల్ల సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం కూడా ఇబ్బందుల్లేకుండా సాగుతుంది.
34
మొదట హైదరాబాద్లో అమలు
ఈ వినూత్న సేవలను తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రారంభించాలని టీజీఎస్ఆర్టీసీ యోచిస్తోంది. నగరంలో లభించే స్పందన, ప్రయాణికుల ఆదరణను పరిశీలించిన తర్వాత వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్తో పాటు ఇతర ప్రధాన పట్టణాలకు కూడా ఈ సేవలను విస్తరించే అవకాశం ఉంది. ఇందుకోసం ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో అధికారులు ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రజా రవాణాను మరింత ఆకర్షణీయంగా మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. కాలుష్యాన్ని తగ్గించడం, ట్రాఫిక్ సమస్యలను కొంత మేర నియంత్రించడం, ప్రజలు వ్యక్తిగత వాహనాల కంటే బస్సులను ఎక్కువగా వినియోగించేలా చేయడం కూడా ఈ ప్రణాళికలో భాగం. ముఖ్యంగా ప్రతిరోజూ ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం బస్సులపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.