న్యూస్ ఛానల్ చూడాలంటే భయం వేసే పరిస్థితి వచ్చింది, వార్త పత్రిక ఓపెన్ చేయాలంటే దడుసుకునే దుస్థితి. సమాజంలో జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే అసలు మనిషి మాయమవుతున్నాడా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
సమాజంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు చూస్తుంటే మానవత్వం అంతమవుతుందా.? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకంటే దారుణ సంఘటన ఏదైనా ఉంటుందా.? అని అనుకుంటున్న ప్రతీ సారి అంతకంటే ఘోరమైన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా జరిగిన రెండు సంఘటనలు అసలు సమాజం ఎటు వేళ్తోందన్న ప్రశ్నలను సంధిస్తోంది. ప్రియుడి కోసం కన్న తల్లిని హతమార్చింది పదో తరగతి చదువుతున్న ఓ కూతురు. డబ్బులు ఇవ్వడం లేదని కన్న తండ్రి నాలుక కోశాడు ఓ ప్రబుద్ధుడు. మనుషుల్లో సహజమైన విలువలు పతనమవుతున్నాయన్న ప్రశ్నలను మిగిలిస్తున్నాయి.
25
తల్లి ప్రాణాన్ని బలి తీసుకున్న కూతురు
హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతోన్న ఓ బాలికకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారింది. తల్లి అడ్డుపడుతుండడంతో ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.
35
అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆందోళనతో తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత రాత్రి సమయంలో బాలిక తిరిగి ఇంటికొచ్చి, నిద్రిస్తున్న తల్లి గొంతు నులిమి, కర్రతో తలపై బలంగా కొట్టి చంపేసింది. ఈ క్రూర చర్యకు బాలికతో పాటు ఆమె ప్రియుడు, అతడి తమ్ముడు కూడా తోడయ్యారు.
అమ్మ తన ప్రేమను అర్థం చేసుకోలేకపోతోంది అనే భావనతో ప్రియుడితో కలిసి ఆమెను అంతం చేసింది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇలాంటి ఓ దారుణ సంఘటన మెదక్లో జరిగింది. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో జరిగిన ఘటన వింటే రక్తం మరిగిపోవాల్సిందే. రైతు భరోసా పథకం కింద వచ్చిన రూ.9 వేలలో రూ.4 వేలు కావాలని అడిగిన కొడుకు.. తండ్రి రూ.5 వేలు ఆసుపత్రి ఖర్చులకు వాడినట్టు చెప్పినా వినకుండా కొడవలితో ఆయన నాలుక కోశాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే కుట్లు వేశారు.
55
ప్రశ్నార్థకంగా మారుతోన్న మానవత్వం
ఇలాంటి సంఘటనలు చదువుతున్న ప్రతీసారి మనసు కలవరపడుతుంది. కట్టుకున్న భర్తను చంపిన భార్య, చివరి వరకు తోడుంటానని వివాహం చేసుకున్న భార్యలను చంపుతోన్న భర్తలు.. ఇలాంటి వార్తలు వింటున్న తరుణంలో... కన్న తల్లిదండ్రులను అంతమొందిస్తున్న ఈ ఉదాంతాలు మనిషి ఏమైపోతున్నాడన్న ప్రశ్నలను సంధిస్తున్నాయి. ప్రేమ పేరుతో తల్లిని హత్య చేయడం, డబ్బు కోసం తండ్రి నాలుక కోసేయడం వంటి చర్యలు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.
మానవ సంబంధాలు పునర్నిర్మించాల్సిన సమయం
ఇలాంటి దారుణాలు తరచూ జరుగుతున్న సందర్భంలో, కుటుంబాల మధ్య భావోద్వేగ సంబంధాలను బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వాడకంపై మార్గదర్శకాలు, పిల్లలకు తల్లిదండ్రుల నుంచి మానసికంగా అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.