తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

వైద్యరంగంలో ఏఐ విప్లవం ... ఇక మానవ ప్రమేయం లేకుండానే రోగ నిర్దారణ

Arun Kumar P | Published : Apr 8, 2025 8:33 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోనూ ఎంటరై అద్భుతాలు చేస్తోంది. ఇప్పటికే వైద్యరంగంలో ఏఐ ప్రవేశించింది... తాజాగా ఈ టెక్నాలజీని ఉపయోగించిన హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ సరికొత్త పరిశోధన చేసింది. ఇలా ఏఐ సాయంతో కిమ్స్ వైద్యులు చేసిన పరిశోధన ఏమిటి? దీని ఫలితం ఎలా ఉంది?  భవిష్యత్ వైద్యశాస్త్రంలో ఏఐ గేమ్ ఛేంజర్ గా ఎలా మారుతుంది? ఇక్కడ తెలుసుకుందాం. 

13
వైద్యరంగంలో ఏఐ విప్లవం ... ఇక మానవ ప్రమేయం లేకుండానే రోగ నిర్దారణ
KIMS Hospital

Artificial Intelligence : మానవుడు సృష్టించిన టెక్నాలజీ ఇప్పుడు వారినే మించిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది... మరో విప్లవం ప్రారంభమయ్యిందనే చెప్పాలి. అన్ని రంగాల్లోనూ అద్భుతాలు చేస్తోంది ఏఐ... చివరకు మనిషి ప్రాణాలు కాపాడేస్థాయికి చేరింది. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి సరికొత్త వైద్యవిధానాలను కనుగొంటున్నారు డాక్టర్లు. ఇలా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు ఏఐ సాయంతో రోగనిర్దారణ చేసారు.  

23
Artificial Intelligence

ఏఐ సాయంతో క్షయవ్యాధి నిర్దారణ : '

ట్యుబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఇన్పెక్షన్ ను టిబి లేదా క్షయ అంటారు. ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసి శ్వాస సమస్యకు దారితీస్తుంది. ఈ బ్యాక్టీరియా ఒకరినుండి ఒకరికి వ్యాపిస్తుంది... అంటే క్షయ అంటువ్యాధి. వేగంగా వ్యాప్తిచెందే ఈ వ్యాధిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా గుర్తించాల్సి ఉంటుంది. లేదంటే ఇదే వేగంగా వ్యాపిస్తుంది. అయితే ఎలాంటి టెస్టులు లేకుండా కేవలం ఎక్స్ రే తో క్షయ వ్యాధిని నిర్దారించేలా ఏఐని ఉపయోగించి సరికొత్త పరిశోధన చేసారు కిమ్స్ డాక్టర్లు. 

 చెస్ట్ ఎక్స్-రేల‌ను ఉప‌యోగించి క్ష‌య వ్యాధి (టీబీ)ని నిర్దారించినట్లు కిమ్స్ హాస్పిటల్స్ పల్మోనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతా శర్మ తెలిపారు. క్యూఎక్స్ఆర్ అనే అత్యాధునిక ఏఐ టూల్‌ను ఉప‌యోగించి మొత్తం 16,675 మంది పేషెంట్ల చెస్ట్ ఎక్స్-రేల‌ను విశ్లేషించామన్నారు. ఇందులో ఎక్కడా మానవ ప్రమేయం లేదని డాక్టర్ వెల్లడించారు. 

క్యూఎక్స్ఆర్ ఏఐ టూల్ ను ఉపయోగించి ముందుగా టిబి ని గుర్తించామని... ఆ తర్వాత రెడియాలజిస్టులు పరిశీలించారని డాక్టర్ లతా శర్మ తెలిపారు. టీబీ కేసుల‌ను గుర్తించ‌డంలో ఏఐ టెక్నాల‌జీ అత్యంత స‌మ‌ర్థ‌మైన‌ద‌ని తమ పరిశోధనలో తేలిందన్నారు. ఏఐ నిర్దారించిన మొత్తం కేసుల్లో 88.7% క‌చ్చిత‌మైన‌విగా తేలింది. దీంతో వ్యాధిని త్వ‌ర‌గా గుర్తించ‌డంలో ఏఐ కీల‌క‌పాత్ర పోషిస్తుంద‌ని నిర్ధార‌ణ అయ్యింది. 
ఆసక్తికర విషయం ఏమిటంటే టిబి లేదని నిర్దారించడంలో ఈ ఏఐ 97 శాతం ఖచ్చితత్వం సాధించింది. ఏఐ టూల్ స్పెసిఫిసిటీ 69.1%గా ఉంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యుహెచ్ఓ) ప్ర‌మాణాల‌ను ఇది అందుకుంటోందని తెలిపారు.

33
Artificial Intelligence in Healthcare and Medical Field

వైద్యరంగంలో గేమ్ చేంజర్ గా ఏఐ : 

తాజాగా క్షయ వ్యాధి నిర్దారణకు చేపట్టిన పరిశోధన వైద్యరంగంలో గేమ్ చేంజర్ గా మారనుంది. ఏఐ గుర్తించిన కేసులన్నింటినీ రేడియాలజిస్టులు కూడా పరిశీలించారు... క్షయ వ్యాధిని నిర్దారించారు. అంటే ఏఐ చాలా ఖచ్చితంగా క్లినికల్ డయాగ్నసిస్ సామర్థ్యాన్ని కలిగివుందని నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం టిబి నిర్దారణకు ఎక్కువ సమయం పడుతుంది... కానీ కిమ్స్ సిబ్బంది పరిశోధన ప్రకారం ఏఐ సాయంతో ఇకపై చాలా తొందరగా టిబిని గుర్తించవచ్చు. ఇది క్షయ వ్యాధి నిర్దారణకు ప్రత్యామ్నాయంగా మారనుంది. 

డాక్టర్ లతా శర్మ ఈ ప‌రిశోధ‌న ప్ర‌భావం గురించి మాట్లాడుతూ అంటువ్యాధి అయిన టిబిని తొందరగా గుర్తించడంలో ఏఐ టూల్ సామ‌ర్థ్యం, దాని కచ్చిత‌త్వం చాలా బాగున్నాయన్నారు. ఇది గేమ్ ఛేంజ‌ర్ కానుందన్నారు. రేడియాలజిస్టులు అందుబాటులో లేని సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ లతా శర్మ అన్నారు. 

ఇక టిబి నిర్దారణకు ఏఐ సాయంతో జరిపిన పరిశోధనపై కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ రేడియాల‌జిస్ట్ డాక్ట‌ర్ చైత‌న్య ఇస‌మ‌ళ్ల మాట్లాడుతూ... మాన‌వ నైపుణ్యానికి ఏఐ ప్ర‌త్యామ్నాయం కాలేదన్నారు. అయితే టిబి వ్యాధి నిర్దారణ విషయంలో తమ పరిశోధన మంచి ఫలితాలు ఇచ్చిందని... ఇది వైద్యరంగంలో ఉపయోగపడుతుందని అన్నారు. తాము ఉపయోగించిన పరికరం చాలా ఖచ్చితత్వంతో పనిచేసింది... ఇది సంక్లిష్ట‌మైన కేసుల్లో వైద్యులకు ఉపయోగపడే సమాచారాన్ని ఇస్తుందన్నారు. 

వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి అద్భుతాలు చేయగలదో కిమ్స్ వైద్యులు టిబిపై చేసిన పరిశోధన బైటపెట్టింది.  క్యూఎక్స్ఆర్ వంటి టూల్స్ భవిష్యత్ లో మరిన్ని అందుబాటులోకి రానున్నాయి... ఇవి రోగులకు చికిత్స అందించడంలో ఎంతగానో ఉపయోగపడనున్నాయి.  టిబి వంటి అంటువ్యాధులను తొందరగా గుర్తించడం ద్వారా వ్యాప్తిని నివారించవచ్చు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ఏఐ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. 

Read more Photos on
click me!
Recommended Photos