
భారత క్రికెట్ జట్టు రాబోయే టీ20 వరల్డ్ కప్లో తమ ట్రోఫీని డిఫెండ్ చేసుకునేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. న్యూజిలాండ్తో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 3-0తో ఆధిక్యం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ వరుసగా 11వ సిరీస్ను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.
ఈ విజయాలతో రాబోయే మెగా టోర్నమెంట్లో భారత్ విజయంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం యువ ఆటగాడు తిలక్ వర్మ టీమిండియాకు బిగ్ మ్యాచ్ ప్లేయర్ అవుతాడని పేర్కొన్నారు.
గత కొన్నేళ్లుగా తిలక్ వర్మ తన ఆటతీరుతో ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా ఎదిగాడని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. 2022 ఐపీఎల్ మెగా ఆక్షన్లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరినప్పటి నుంచి తిలక్ ఆటలో ఎంతో పరిణితి కనిపించిందని రోహిత్ తెలిపారు. తన మొదటి సీజన్లోనే తిలక్ అందరి దృష్టిని ఆకర్షించాడన్నారు. 2022 సీజన్ లో 36.09 సగటు, 131.02 స్ట్రైక్ రేట్తో ఏకంగా 397 పరుగులు సాధించాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో తన ఫామ్ను కొనసాగిస్తూ 42.88 సగటుతో 343 పరుగులు చేశాడు. ఇక 2024 ఐపీఎల్ సీజన్ లో మరింత నిలకడగా రాణిస్తూ 41.60 సగటుతో 416 పరుగులు సాధించాడు. ఇలా ప్రతి సీజన్లోనూ నిలకడగా రాణిస్తూ, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడని రోహిత్ పేర్కొన్నారు.
భారత జాతీయ జట్టు తరపున ఇప్పటికే 40 టీ20 మ్యాచ్లు ఆడిన తిలక్ వర్మ, 2026 టీ20 వరల్డ్ కప్ ప్రణాళికల్లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. జియో హాట్స్టార్లో ప్రసారమైన కెప్టెన్ రోహిత్ శర్మ రోడ్మ్యాప్ ఫర్ టీ20 వరల్డ్ కప్ కార్యక్రమంలో జతిన్ సప్రూతో మాట్లాడుతూ రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"తిలక్ వర్మ మొదటిసారి ముంబై ఇండియన్స్ సెటప్లోకి వచ్చినప్పుడే, అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని నాకు అనిపించింది. నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం అతని మాట తీరు. అతను చాలా అమాయకంగా మాట్లాడేవాడు, కానీ ఆ మాటల్లో ఎంతో అర్థం, క్రికెట్ పట్ల అవగాహన ఉండేవి" అని రోహిత్ గుర్తు చేసుకున్నారు.
తిలక్ వర్మ ఎప్పుడూ బాధ్యత తీసుకునేందుకు సిద్ధంగా ఉంటాడని రోహిత్ ప్రశంసించారు. "అతను నాతో మాట్లాడినప్పుడల్లా ఒకటే చెప్పేవాడు.. 'నేను ఆ పని చేస్తాను. దయచేసి నన్ను బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపండి. నేను మ్యాచ్ గెలిపిస్తాను' అని అడిగేవాడు. 2022, 2023 సీజన్లలో నేను కెప్టెన్గా ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించాను. అతనికి క్రికెట్ అంటే పిచ్చి. ఆ మైండ్సెట్, ఆటిట్యూడ్ చాలా గొప్పవి" అని రోహిత్ తెలిపారు. యువ ఆటగాడిగా ఉండి కూడా క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకోవాలనే తపన అతనిలో మెండుగా ఉంటుందని రోహిత్ పేర్కొన్నారు.
ఆసియా కప్ 2025లో పాకిస్థాన్పై తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ను రోహిత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తోంది. కేవలం 20 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది.
స్టేడియం మొత్తం పాక్ అభిమానుల అరుపులతో నిండిపోయింది. అటువంటి ఒత్తిడిలో తిలక్ వర్మ 53 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అతని పోరాటంతో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, తొమ్మిదవ ఆసియా కప్ టైటిల్ను గెలుచుకుంది.
"అంత ఒత్తిడిలో, మరో వైపు వికెట్లు పడుతున్నా, ఫైనల్ మ్యాచ్ అనే భయం లేకుండా అతను ఆడిన తీరు అద్భుతం. అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు" అని రోహిత్ కొనియాడారు.
బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు, ఫ్లెక్సిబిలిటీ గురించి కూడా రోహిత్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. "టాప్ 3 బ్యాటర్లను అనవసరంగా మార్చకూడదని నేను నమ్ముతాను. కానీ అవతలి జట్టు బౌలర్, మ్యాచ్ పరిస్థితిని బట్టి మిగతా వారి స్థానాల్లో మార్పులు చేయడం సహజం. రాహుల్ ద్రవిడ్ భాయ్ కూడా ఇలాంటి విషయాలను చర్చించడానికి ఆసక్తి చూపేవారు" అని రోహిత్ చెప్పారు.
అలాగే, టీ20లో రీబిల్డ్ ఫిలాసఫీ పనవ్వదని రోహిత్ స్పష్టం చేశారు. "20 పరుగులకు 3 వికెట్లు పడినా సరే, భయపడి 140 పరుగుల కోసం ఆడకూడదు. 170-180 పరుగులే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఒకవేళ 50 పరుగులకే ఆలౌట్ అయినా పర్లేదు, కానీ సరైన ఇంటెంట్తో ఆడటం ముఖ్యం. 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాం, కానీ భయంతో ఆడితే ఫలితం ఉండదు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో మేము 30/3 స్థితిలో ఉన్నప్పుడు అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ను చక్కదిద్ది 176 పరుగులు చేశారు. అది మంచి స్కోరు అని నేను నమ్మాను" అని రోహిత్ తన వ్యూహాన్ని వివరించారు.