
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సంబంధించి భారత క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న యువ సంచలనం తిలక్ వర్మ, సిరీస్లోని మిగిలిన రెండు మ్యాచ్లకు పూర్తిగా దూరమయ్యాడు. మొదట అతను త్వరగానే కోలుకుంటాడని భావించినప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించడానికి మరింత సమయం పడుతుందని తేలడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
దీంతో, తిలక్ వర్మ స్థానంలో సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టుతోనే కొనసాగనున్నట్లు సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఈ పరిణామం రాబోయే టీ20 ప్రపంచ కప్ 2026 సన్నాహాల్లో భాగంగా జట్టు కూర్పుపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం తిలక్ వర్మ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోలుకుంటున్నాడు.
తిలక్ వర్మ ఇటీవల పొత్తికడుపు సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. రాజ్కోట్లో ఈ సర్జరీ జరిగినట్లు సమాచారం. అయితే, అతను కోలుకుంటున్నాడని, ఫిజికల్ ట్రైనింగ్ కూడా మొదలుపెట్టాడని వార్తలు వచ్చాయి. కానీ, అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే స్థాయి ఫిట్నెస్ను ఇంకా అందుకోలేదని బీసీసీఐ వెల్లడించింది.
బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ఒక అధికారిక ప్రకటనలో మాట్లాడుతూ.. "టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ ఫిజికల్ ట్రైనింగ్ ను స్టార్ట్ చేశారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతని రిహాబిలిటేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. అయితే, పూర్తి మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి అతనికి ఇంకాస్త సమయం కావాలి. అందుకే న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్లోని చివరి రెండు టీ20లకు అతను అందుబాటులో ఉండడు" అని పేర్కొన్నారు.
తిలక్ వర్మ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనే విషయంలో కూడా స్పష్టత వచ్చింది. ఫిబ్రవరి 3న ముంబైలో అతను తిరిగి జట్టుతో కలవనున్నాడు. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్కు ముందు జరిగే వార్మప్ మ్యాచ్ల నాటికి అతను పూర్తిగా కోలుకుంటాడని బోర్డు భావిస్తోంది.
ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా ఫిబ్రవరిలో జరిగే వార్మప్ మ్యాచ్లో సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఆ మ్యాచ్ సమయానికి తిలక్ వర్మ అందుబాటులోకి వస్తాడని సమాచారం. అప్పటివరకు అతను బెంగళూరులోనే ఉండి తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకోనున్నాడు.
వాస్తవానికి తిలక్ వర్మకు ప్రత్యామ్నాయంగానే శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పుడు తిలక్ వర్మ సిరీస్ మొత్తానికి దూరం కావడంతో, సెలెక్షన్ కమిటీ శ్రేయస్ అయ్యర్ను జట్టులోనే కొనసాగించాలని నిర్ణయించింది. న్యూజిలాండ్ సిరీస్లోని మిగిలిన మ్యాచ్లకు అయ్యర్ జట్టుకు అందుబాటులో ఉంటాడు.
అయ్యర్ ఇప్పటివరకు ఈ సిరీస్లో ప్లేయింగ్ లెవెన్లోకి రాలేదు. అయితే, అనుభవజ్ఞుడైన అయ్యర్ జట్టులో ఉండటం బ్యాటింగ్ డెప్త్కు ఎంతో మేలు చేస్తుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. త్వరలో జరగబోయే మ్యాచుల్లో అతనికి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి మరి.
ఇక సిరీస్ విషయానికి వస్తే, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే కివీస్పై ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి మూడు మ్యాచ్లలో ఘనవిజయం సాధించి 3-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. జనవరి 28న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
గత మ్యాచ్లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ (20 బంతుల్లో 68 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 57 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్లతో చెలరేగారు. బౌలింగ్లో రవి బిష్ణోయ్ 2/18 గణాంకాలతో కివీస్ను కట్టడి చేశాడు. వైజాగ్ మ్యాచ్లో కూడా ఇదే జోరును కొనసాగించి క్లీన్ స్వీప్ దిశగా భారత్ అడుగులు వేస్తోంది.
మిగిలిన రెండు మ్యాచ్లకు భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్.
వరల్డ్ కప్ ముందు ఈ సిరీస్ భారత్కు చాలా కీలకం కాబట్టి, మేనేజ్మెంట్ ఆటగాళ్ల ఫిట్నెస్, ఫామ్పై ప్రత్యేక దృష్టి సారించింది.