
హిందూ ధార్మిక సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది పవిత్రమైన మాసంగా భావిస్తారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం అనంతరం వచ్చే ఐదవ నెలగా దీనిని పరిగణిస్తారు. శ్రావణ మాసం మొత్తం పరమశివుని భక్తితో నిండివుంటుంది. ఈ మాసంలో భక్తులు రోజూ ఉపవాసాలు, వ్రతాలు చేస్తూ శివారాధనలో ఉంటారు.
ఈ మాసంలో సోమవారాలు ప్రత్యేక పూజలు చేస్తారు. పరమశివున్ని జలాభిషేకాలతో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. రాఖీ పూర్ణిమ, వరలక్ష్మీ వ్రతం, నాగ పంచమి, కృష్ణాష్టమి వంటి పండుగలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. అందుకే ఈ మొత్తం నెలను ఎంతో శుభమైనదిగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన మాసంగా భక్తులు నమ్ముతారు.
సాధారణంగా మన పెద్దలు శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదని చెబుతుంటటారు. దీనివెనకున్న ఆసలు కారణం.. ఇది ఆధ్యాత్మిక పర్వదినాల సమాహార మాసం. శివుని పూజలు, ఉపవాసాలు, ధ్యానాలు జరగడం వల్ల, శరీరం పౌర్ణికంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మాంసాహారానికి దూరంగా ఉండాలని చెబుతారు.
శ్రద్ధ, భక్తిభావంతో శివారాధన చేయాలంటే, మనం తీసుకునే ఆహారాలు కూడా శుద్ధంగా ఉండాలని పురాణాలు పేర్కొంటున్నాయి. మాంసాహారాన్ని తినడం వల్ల పూజలకు అపవిత్రత కలుగుతుందని విశ్వాసముంది. ఇది కేవలం ఆచారంగానే కాకుండా, ఆరోగ్య పరిరక్షణకూ ఒక మార్గంగా చూడవచ్చు.
శ్రావణ మాసం అంటే వర్షాకాలం మధ్యదశ. ఈ కాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది, శరీరంలో జీర్ణక్రియ బలహీనంగా ఉంటుంది. ఆయుర్వేదం శాస్త్రాల ప్రకారం.. శ్రావణ మాసంలో తీసుకునే మసాలా లేదా మాంసాహారం వంటి కఠిన ఆహార పదార్థాలు త్వరగా జీర్ణం కావు.
అలాగే, వర్షాలతో కలుషితమైన నీటిలో జీవించే చేపలు, రొయ్యలు వంటి జలచరాల ద్వారా అనారోగ్యాన్ని కలిగించే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశమూ ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, అజీర్ణం వంటి సమస్యలకు ఇది కారణమవుతుంది. అందుకే వైద్య నిపుణులు శ్రావణమాసంలో మాంసాహారానికి బదులుగా శాకాహారం తీసుకోవాలని సూచిస్తారు.
వర్షాకాలం (శ్రావణ మాసం) అనేది జలచరాల సంతానోత్పత్తి కాలం కూడా. ఈ సమయంలో చేపలు, ఇతర జలచరాలు గర్భధారణలో ఉంటాయి. అటువంటి సమయంలో వాటిని వేటాడటం వల్ల పునరుత్పత్తి ప్రక్రియకు భంగం కలుగుతుంది. దీని వల్ల జాతుల సంఖ్య తగ్గిపోతుంది, పర్యావరణ సంతులనం దెబ్బతింటుంది. కాబట్టి ఒకరకంగా జీవరాశుల పరిరక్షణలో కూడా శ్రావణ మాసం పాత్ర కీలకంగా ఉందని చెప్పవచ్చు.
శ్రావణ మాసంలో మగవారు, మహిళలు ఇద్దరు కూడా ఉపవాసాలు పాటిస్తారు. సోమవారాలు శివుని, మంగళవారాలు అమ్మవారిని, గురువారాలు గురుదేవుని, శుక్రవారాలు లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తారు. ఈ సమయంలో మాంసాహారంతో పాటు మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉంటారు.
శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు... ప్రతిరోజూ ఉపవాసాలు, పూజలు, వ్రతాలు... అంతా ఎంతో ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. దీన్ని పాటించటం వల్ల శరీరానికి డిటాక్సిఫికేషన్ జరుగుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
అంటే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదని చెప్పడం వెనుక గల కారణాలు కేవలం మతపరమైనవే కాదు. శాస్త్రీయ, వైద్యపరమైన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి.