weather update: ఈ ఏడాది భారత్ లో నైరుతి రుతుపవనాలు గతంలో పోలిస్తే ముందుగానే వస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ప్రస్తుతం రుతుపవనాలు సాధారణ గమనంలో ముందుకు సాగుతున్నాయని ఐఎండీ తెలిపింది. శుక్రవారం నాటికే రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమొరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల మిగిలిన భాగాలు, అండమాన్ సముద్ర ప్రాంతం, తూర్పు మధ్య బంగాళాఖాతం కొంత భాగాన్ని అధిగమించాయని తెలిపింది.
దీని ప్రభావంతో శనివారం నుంచి వచ్చే మూడునాలుగు రోజులలో వర్షాలు మరిన్ని ప్రాంతాలకు విస్తారిస్తాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు & కొమొరిన్ ప్రాంతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం భాగాల్లో వర్షాలు క్రమంగా పెరుగుతూ ముందుకు సాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మే చివరన కేరళలను రుతుపవనాలు తాకుతాయనీ, సాధారణం కంటే నాలుగు రోజుల ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను తాకుతాయని తెలిపింది.
ఇదిలా ఉండగా, ఉత్తర భారతదేశం కఠిన వేసవిని ఎదుర్కొంటోంది. అలాగే, దక్షిణ భారతంలో కూడా పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఐఎండీ శాస్త్రవేత్త డా. నరేష్ కుమార్ మాట్లాడుతూ.. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయని తెలిపారు. రానున్న నాలుగైదు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో తేలికపాటి వేడి గాలులు వీస్తాయని చెప్పారు. ఢిల్లీలో ప్రస్తుతం ఎల్లో అలర్ట్ అమలులో ఉందని చెప్పారు.
అయితే శుక్రవారం ఢిల్లీలో వర్షాలు కురవడం వల్ల కొంత ఉపశమనం లభించింది. శనివారం కూడా మేఘావృతమైన వాతావరణం కనిపించింది. వర్షాల కారణంగా ఢిల్లీలో ఉష్ణోగ్రత 37–39 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుందని అంచనా.
తెలుగు రాష్ట్రాలకు సాధారణం కంటే త్వరగానే రుతుపవనాలు
రుతుపవనాలు అండమాన్ తీరం చేరాయి. ఈ నెల చివరికల్లా కేరళ తీరానికి చేరుకోనున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఈ శుక్రవారం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా ఉండగా, రాయలసీమ, తీర ప్రాంతాల్లో గాలివానలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ తో పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాటిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలు ఉన్నాయి.