Published : Aug 05, 2025, 10:07 PM ISTUpdated : Aug 05, 2025, 10:09 PM IST
Uttarkashi Floods: ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ తర్వాత భారీ వరదలు వచ్చాయి. దీంతో ధరాలి గ్రామం మునిగిపోయింది. చాలా మంది గల్లంతయ్యారు. వారిలో 10 మంది ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్.. నీటమునిగిన ధరాలి గ్రామం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామాన్ని మంగళవారం (ఆగస్టు 5న) ఉదయం భారీ వరదలు ముంచెత్తాయి. దీనికి ప్రధాన కారణం క్లౌడ్ బరస్ట్ (Cloudburst).. దీంతో తీవ్రంగా నష్టపోయింది. కీర్ గంగా నదీ ప్రవాహం అనూహ్యంగా పెరిగి, భారీ వరదలుగా మారింది.
వరద ప్రవాహంతో గ్రామం మొత్తాన్ని మట్టితో కూడిన బురద నీరు ముంచెత్తింది. హోటళ్ళు, రహదారులు, ఇండ్లు కొట్టుకుపోయాయి. ఎన్నో ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటికి తీయడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
DID YOU KNOW ?
క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి?
క్లౌడ్ బరస్ట్ అనేది చిన్న పరిధిలో (సుమారు 20–30 చ.కి.మీ ప్రాంతం) ఒక్కసారిగా భారీ వర్షపాతం కురిసే ప్రకృతి విపత్తు. సాధారణంగా ఒక గంటలో 100 మిల్లీమీటర్లకు మించిన వర్షపాతం నమోదైతే, దాన్ని క్లౌడ్ బరస్ట్గా పరిగణిస్తారు. ఇది సాధారణ వర్షం కంటే చాలా తీవ్రంగా, హఠాత్గా జరుగుతుంది. ఎక్కువగా హిమాలయ పర్వత పరిసరాల్లో, కొండల మధ్య భాగాల్లో క్లౌడ్ బరస్ట్ లు సంభవిస్తాయి.
25
ఉత్తరకాశీలో ఆర్మీ క్యాంప్ ధ్వంసం.. 10 మంది జవాన్లు గల్లంతు
ధరాలి సమీపంలోని హర్షిల్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ ఆర్మీ క్యాంప్ కూడా వరదల ధాటికి పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో జేసీవో (JCO) సహా మొత్తం 10 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. వారికి సంబంధించి వెతుకులాట కొనసాగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం, ఆర్మీ బేస్లో ఉన్న సామగ్రి కూడా పూర్తిగా దెబ్బతిన్నది.
35
యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు
వరదల సమాచారం అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ, ఆర్మీ, NDRF, SDRF, ITBP బృందాలు రంగంలోకి దిగాయి. SDRF బృందాలు ముందుగా 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Air Force) హెలికాప్టర్లను స్టాండ్ బై లో ఉంచారు. ఐటీబీపీ ప్రత్యేక బృందాలు కూడా 50 మందిని రక్షించాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
14 Raj Rif బెటాలియన్కి చెందిన ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి దాదాపు 20 మందిని రక్షించారు. తీవ్రమైన వర్షపు మధ్య, కొట్టుకుపోతున్న ప్రజలను భద్రతా ప్రాంతాలకు చేర్చడంలో వీరు ప్రాణాలకు తెగించి పని చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
55
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఏమన్నారంటే?
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. అన్ని సహాయక బృందాలూ యుద్ధ స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పరిస్థితిపై ప్రత్యక్ష సమాచారం తీసుకొని, వెంటనే అదనపు బృందాల్ని మోహరించారు.
ప్రధాని మోడీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, అవసరమైన సహాయాన్ని ప్రకటించారు. హర్షిల్లోని ఆర్మీ ఆసుపత్రిలో గాయపడిన బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ధరాలి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ తీసుకొచ్చిన వరద విధ్వంసం.. అక్కడి ప్రజల జీవితాలను ఒక్కసారిగా శూన్యంలోకి నెట్టేసింది. ఈ ఘోర విపత్తు దృశ్యాలు వైరల్ గా మారాయి.