
తమిళ సినీ పరిశ్రమలో ‘దళపతి’గా పేరు తెచ్చుకున్న విజయ్, చాలా కాలంగా సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తన ప్రభావాన్ని పెంచుకుంటూ వచ్చారు. అభిమాన సంఘాల రూపంలో ప్రారంభమైన ఆయన నెట్వర్క్, తరువాత భారీ సామాజిక శక్తిగా మారింది. 2024 ఫిబ్రవరిలో ఆయన అధికారికంగా తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించారు.
ఆ సమయంలోనే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇకపై సినిమాలకు దూరంగా ఉండి పూర్తిస్థాయిలో ప్రజాసేవకే అంకితం అవుతానని ప్రకటించారు. తన చివరి చిత్రం “జన నాయగన్” అనంతరం రాజకీయాలపైనే దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా, నేరుగా 2026 అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా ఎంచుకోవడం ఆయన వ్యూహాత్మక నిర్ణయంగా మారింది.
విజయ్ రాజకీయ ఎదుగుదల వెనుక ప్రధాన బలం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ అనే అభిమాన సంస్థ. మొదట ఇది అభిమాన సంఘంగానే ప్రారంభమైనప్పటికీ, తరువాత గ్రామస్థాయి వరకు విస్తరించిన బలమైన వ్యవస్థగా మారింది. వరదలు, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సంస్థ చేసిన సేవా కార్యక్రమాలు విజయ్కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
2023లో తమిళనాడులో వరదలు సంభవించిన సమయంలో బాధితులకు సహాయం చేయడం, యువతతో ప్రత్యక్షంగా కలవడం ఆయన ఇమేజ్ను మరింత బలపరిచింది. అనంతరం విల్లుపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. లక్షలాది మంది హాజరుకావడం చూసి సంప్రదాయ పార్టీలే అప్రమత్తమయ్యాయి. ఆ సభలలో విజయ్ నేరుగా కుటుంబ రాజకీయాలపై, అవినీతి పాలనపై విమర్శలు చేయడం ద్వారా యువత, దళిత వర్గాల మద్ధతు సంపాదించారు.
ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికర పోటీ చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ విజయ్ స్వయంగా బరిలోకి దిగారు. డీఎంకేకు చెందిన బలమైన నాయకుడితో ఆయన నేరుగా తలపడటం ఎన్నికల హీట్ను మరింత పెంచింది. ప్రారంభ ట్రెండ్ల నుంచే టీవీకే ఊహించని రీతిలో ఆధిక్యంలోకి రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా యువ ఓటర్లు, పట్టణ ప్రాంతాలు, తొలి సారి ఓటు వేసిన యువత విజయ్ వైపు మొగ్గు చూపినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
అయితే టీవీకేకు పూర్తి మెజారిటీ రాకపోవడంతో, కాంగ్రెస్ సహా కొన్ని చిన్నపార్టీలు మద్ధతు ప్రకటించాయి. దీంతో విజయ్ మేజిక్ ఫిగర్ చేరుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వరుసగా గవర్నర్తో భేటీలు నిర్వహించిన అనంతరం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ముఖ్యమంత్రి పదవి దక్కడం విజయ్కు పెద్ద విజయమే అయినప్పటికీ, అసలు పరీక్ష ఇప్పుడు మొదలుకానుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం పూర్తిగా మిత్రపక్షాల మద్ధతుపైనే ఆధారపడి ఉంది. కాంగ్రెస్తో పాటు సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు బయట నుంచి మద్ధతు ఇస్తున్నాయి. అయితే ఇవి ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకపోవడం రాజకీయంగా ప్రమాద సంకేతంగా భావిస్తున్నారు. అవసరమైతే ఎప్పుడైనా ఒత్తిడి తేవచ్చనే పరిస్థితి ఉంది.
అసెంబ్లీలో సంఖ్యాబలం తక్కువగా ఉంటే చిన్న అసంతృప్తి కూడా ప్రభుత్వాన్ని కుదిపేసే అవకాశం ఉంటుంది. కనీసం రెండు చిన్నపార్టీలు మద్ధతు ఉపసంహరించుకున్నా ప్రభుత్వం సంక్షోభంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. అంటే విజయ్కు కేవలం పాలన నిర్వహించడం మాత్రమే కాదు, మిత్రపక్షాలను సంతృప్తిపరచడం కూడా కీలక బాధ్యతగా మారబోతోంది.
విజయ్ రాజకీయ ప్రయాణం అంతా సాఫీగా సాగలేదు. భారీ ర్యాలీల సమయంలో జరిగిన ఘటనలు, విమర్శలు, రాజకీయ ప్రత్యర్థుల దాడులు ఆయనను పలుమార్లు ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఒక ర్యాలీలో తొక్కిసలాట జరగడంతో ప్రాణనష్టం సంభవించడం పెద్ద వివాదంగా మారింది. ఆ ఘటనపై విచారణలు కూడా జరిగాయి. ఇంకా రాజకీయ సిద్ధాంతాల విషయంలో ఆయన కుటుంబంలోనే విభేదాలు బయటపడ్డాయి. తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్తో ఉన్న విభేదాలు కోర్టు వరకు వెళ్లడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది.
ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ముందున్న అసలు సవాళ్లు మరింత క్లిష్టంగా ఉండబోతున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, కేంద్రంతో సంబంధాలు, మిత్రపక్షాల ఒత్తిళ్లు అన్నీ కలిపి ఆయన ప్రభుత్వాన్ని నిరంతరం పరీక్షించనున్నాయి.
తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత తరహాలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన సక్సెస్ ఫుల్ లీడర్గా విజయ్ ఎదుగుతారా.? లేక కూటమి రాజకీయాల ఒత్తిడిలో చిక్కుకుంటారా? అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది.