దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?

Published : Aug 21, 2026, 09:47 PM IST

Sugar Price: దేశీయ మార్కెట్లో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంతో కేంద్రం స్పందించింది. ఇథనాల్‌ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడం వల్లే ధరలు పెరిగాయన్న ఆరోపణలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇతర కారణాలు ఉన్నాయని స్ప ష్టం చేసింది

PREV
15
జులై నుంచి ఆగస్టు వరకు భారీగా పెరిగిన ధర

దేశంలో చక్కెర రిటైల్‌ ధరలు గత నెల రోజుల్లో గణనీయంగా పెరిగాయి. జులై 20న కిలో చక్కెర సగటు ధర రూ.48.18గా ఉండగా.. ఆగస్టు 20 నాటికి రూ.55.70కి చేరింది. అంటే నెల వ్యవధిలోనే కిలోకు రూ.7.52 మేర పెరుగుదల నమోదైంది. కొన్ని రాష్ట్రాలు, నగరాల్లో ధరలు జాతీయ సగటు కంటే కూడా అధికంగా ఉన్నాయి. ఈ పరిణామంపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇదే సమయంలో చక్కెరను ఇథనాల్‌ తయారీకి మళ్లించడం వల్ల దేశీయంగా అందుబాటులో ఉన్న చక్కెర పరిమాణం తగ్గిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే ఈ వాదనలో వాస్తవం లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

25
ఇథనాల్‌ కోసం మళ్లిస్తున్న చక్కెర వాటా తగ్గింది

ఇథనాల్‌ విధానంపై కేంద్రం కీలక గణాంకాలను వెల్లడించింది. పెట్రోల్‌లో కలపడానికి అవసరమైన ఇథనాల్‌ తయారీ కోసం చక్కెరను మళ్లించే వాటా గతంతో పోలిస్తే తగ్గిందని తెలిపింది. 2022-23 సీజన్‌లో ఈ వాటా సుమారు 12 శాతం ఉండగా.. 2025-26 సీజన్‌లో అది 9 శాతానికి పడిపోయింది. అంతేకాకుండా దేశంలో ఇథనాల్‌ ఉత్పత్తికి చెరకు ఆధారిత వనరులపైనే పూర్తిగా ఆధారపడటం లేదని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న ఇథనాల్‌లో గణనీయమైన భాగం మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచి వస్తోందని వివరించింది. దీంతో చక్కెరను ఇథనాల్‌ తయారీకి మళ్లించడమే ప్రస్తుత ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని చెప్పడం సరైంది కాదని కేంద్రం స్పష్టం చేసింది.

35
పంట దిగుబడి తగ్గడం.. పండగల డిమాండ్‌ ప్రభావం

చక్కెర ధరల పెరుగుదలకు దేశీయ ఉత్పత్తి పరిస్థితులు కూడా కారణమయ్యాయని ప్రభుత్వం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో చెరకు దిగుబడి అంచనాల కంటే తక్కువగా వచ్చింది. పంట నష్టం కూడా సరఫరాపై ప్రభావం చూపింది. దీంతో మార్కెట్‌లో అందుబాటులో ఉండే చక్కెర పరిమాణంపై ఒత్తిడి ఏర్పడింది. ఇదే సమయంలో పండగల సీజన్‌ ప్రారంభం కావడంతో చక్కెరకు డిమాండ్‌ పెరిగింది. స్వీట్లు, బేకరీ ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాల తయారీలో చక్కెర వినియోగం పెరగడం సహజంగానే మార్కెట్‌పై ప్రభావం చూపింది. అంతర్జాతీయంగా సరఫరా పరిస్థితుల్లో మార్పులు, మార్కెట్‌లో అనిశ్చితి, కొందరు వ్యాపారులు ముందస్తుగా నిల్వలు పెంచుకోవడం వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు దోహదం చేశాయని కేంద్రం పేర్కొంది.

45
కీలక మార్కెట్లలోనూ ధరలకు రెక్కలు

చక్కెర ధరల పెరుగుదల దేశంలోని పలు ప్రధాన మార్కెట్లలో స్పష్టంగా కనిపించింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ దేశంలో ప్రముఖ చక్కెర మార్కెట్లలో ఒకటి. అక్కడ ఆగస్టు ప్రారంభం నుంచి హోల్‌సేల్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. 100 కిలోల చక్కెర ధర రూ.5,350 స్థాయికి చేరినట్లు మార్కెట్‌ గణాంకాలు సూచిస్తున్నాయి. రిటైల్‌ మార్కెట్‌లోనూ ప్రాంతాన్ని బట్టి ధరల్లో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. పంజాబ్‌లో కొన్ని ప్రాంతాల్లో కిలో చక్కెర ధర సుమారు రూ.65 వరకు చేరగా.. ముంబై, భోపాల్‌ తదితర ప్రాంతాల్లో కొన్ని మార్కెట్లలో రూ.58 నుంచి రూ.63 మధ్య ధరలు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా సరఫరా పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.

55
ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు

చక్కెర ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. మార్కెట్‌లో అవసరమైన స్థాయిలో నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు, నిల్వలపై పరిమితులు విధించింది. అధికంగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించే అవకాశాలను తగ్గించేందుకు ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

అదనంగా 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో సరఫరా పెరిగితే ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మరోవైపు పండగల సీజన్‌లో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరా వ్యవస్థను పర్యవేక్షించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

మొత్తంగా చూస్తే చక్కెర ధరల ప్రస్తుత పెరుగుదలకు ఇథనాల్‌ విధానమే ఏకైక కారణం కాదని కేంద్రం చెబుతోంది. దేశీయ ఉత్పత్తి, పంట నష్టం, పండగల డిమాండ్‌, మార్కెట్‌ పరిస్థితులు, నిల్వలు వంటి అనేక అంశాలు కలిసి ధరలపై ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దిగుమతులు, నిల్వల నియంత్రణ, సరఫరా పెంపు వంటి చర్యలు రానున్న రోజుల్లో ధరలను ఏ మేరకు తగ్గిస్తాయన్నది కీలకంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories