Temple In Pakistan
పాకిస్థాన్లో రామాలయాన్ని నిర్మించేందుకు పాకిస్తాన్లోని హిందూ సంఘం ముందుకు వచ్చింది. పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రం, థార్పార్కర్ జిల్లా, మెఘవాల్ బాడా అనే గ్రామంలోని హిందువులు తమ గ్రామంలో రామమందిరం నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇది వారి భక్తి, విశ్వాసానికి చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ మందిర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నవారు అక్కడి పూజారి థారు రామ్. ఆయన ఒక భారతీయ యాత్రలో భాగంగా గంగాజలాన్ని తీసుకువచ్చారు. "మనం గంగామాతను దర్శించాం. కానీ గంగానదిని చూసి ఏమీ అడగలేదు. ఒక్కటే కోరుకున్నాం – మా గ్రామంలో శ్రీరాముని ఆలయం ఉండాలి. మనకు ధనం, ఆస్తి అవసరం లేదు. రాముడి మందిరమే కావాలి," అని థారు రామ్ తెలిపారు.
ఈ రామమందిరం నిర్మాణానికి ప్రభుత్వం నుంచి లేదా రాజకీయ పార్టీలు నుంచి ఎటువంటి సహాయం లేదు. ఇది పూర్తిగా భక్తుల విశ్వాసం మీద నిలబడిన ఒక పవిత్ర కార్యక్రమం.
పాకిస్తాన్లో భయాలతో, కష్టాలతో ఉన్నా… హిందూ సమాజం ఇలా తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమంటే అది చిన్న విషయం కాదు. ఇది నిజమైన భక్తి యొక్క మహత్యాన్ని చూపుతోంది.
Sri Rama
పాకిస్తాన్లోని థార్పార్కర్ జిల్లాలో ఉన్న మెఘవాల్ బాడా గ్రామంలో రామమందిరం నిర్మాణాన్ని ఆరు నెలల క్రితం ప్రారంభించారు. ఆలయ పూజారి థారూ రామ్ తెలిపిన ప్రకారం, ప్రధాన ఆలయం ఇప్పటికే పూర్తయ్యింది. ఇప్పుడు కేవలం రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయాల్సి ఉంది. ఆలయం చుట్టూ సత్సంగ్ వేదిక, కాంపౌండ్ వాల్, ఇతర సౌకర్యాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ మందిరాన్ని నిర్మించేందుకు పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల నుంచి హిందూ సమాజం ఇటుకలు, సిమెంట్, కూలీ పనులు వంటి రూపాల్లో సహాయం అందిస్తోంది. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక స్థలంగా కాకుండా, పాకిస్తాన్లో హిందువుల ఐక్యతకు, ఆత్మగౌరవానికి గుర్తుగా నిలుస్తోంది.
ఈ రామమందిరం స్థానిక హిందూ సమాజానికి నమ్మక చిహ్నంగా మారింది. ఆశ్చర్యకరంగా, అక్కడి ముస్లిం సమాజం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు. కొందరు ముస్లింలు కూడా ఈ ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్నారని పూజారి వెల్లడించారు. ఇది భక్తి పరంగా మాత్రమే కాకుండా, సామాజిక సమరసతకు ప్రతీకగా మారుతోంది.