PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ట్రినిడాడ్ & టొబాగో అత్యున్నత గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ త్రినిడాడ్ అండ్ టొబాగో’ (ORTT) లభించింది. ఇది ప్రధాని మోడీకి లభించిన 25వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం.
ట్రినిడాడ్ & టొబాగోలో అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి విదేశీ నాయకుడు ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీకి ట్రినిడాడ్ & టొబాగో ప్రభుత్వం తమ అత్యున్నత పౌర గౌరవం ‘ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ త్రినిడాడ్ అండ్ టొబాగో’ (Order of the Republic of Trinidad and Tobago - ORTT) ను ప్రదానం చేసింది. ఈ అవార్డును స్వీకరించిన తొలి విదేశీ నాయకుడిగా మోడీ చరిత్ర సృష్టించారు. ఇది ఆయనకు లభించిన 25వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం.
27
పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో ఘనసన్మానం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని రాష్ట్రపతి భవన్లో శుక్రవారం (జూలై 4వ తేదీ) జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ట్రినిడాడ్ & టొబాగో రాష్ట్రపతి క్రిస్టీన్ కంగాలో (Christine Kangaloo) ఈ అవార్డును ప్రధాని మోడీకి అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, “ఈ గౌరవాన్ని 140 కోట్ల భారతీయుల తరఫున స్వీకరిస్తున్నాను. ఇది మా దేశాల మధ్య సుస్థిర, శాశ్వతమైన స్నేహానికి ప్రతీక” అని పేర్కొన్నారు.
37
మొదటి విదేశీ నాయకుడిగా మోడీ
ట్రినిడాడ్ & టొబాగో అత్యున్నత గౌరవాన్ని పొందిన తొలి విదేశీ నాయకుడు ప్రధాని మోడీ కావడం విశేషం. ఈ పురస్కారం సాధారణంగా దేశీయ వ్యక్తులకు మాత్రమే అందిస్తారు. అయితే, మోడీని గౌరవించడం ద్వారా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం ద్వైపాక్షిక సంబంధాలకు ఉన్న ప్రాధాన్యతను హైలైట్ చేసింది.
ఇరు దేశాల సాంస్కృతిక బంధాన్ని గుర్తు చేసిన ప్రధాని మోడీ
అవార్డు అందుకున్న తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ, “ప్రెసిడెంట్ కంగాలో పూర్వీకులు తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లువర్ కు చెందిన వారు.. గొప్ప తత్వవేత్త సెయింట్ తిరువల్లువర్ బలమైన దేశాలు ఆరు లక్షణాలు కలిగి ఉండాలని చెప్పారు. వాటిలో బలమైన సైన్యం, దేశభక్తి, సమృద్ధి వనరులు, విజ్ఞత నాయకత్వం, బలమైన రక్షణ వ్యవస్థ, మిత్ర దేశాలు.. ఇవన్నీ ట్రినిడాడ్ & టొబాగోలో కనిపిస్తున్నాయి” అని వివరించారు.
అలాగే, భారతదేశం-ట్రినిడాడ్ & టొబాగో మధ్య ఉన్న సాంస్కృతిక, క్రీడా, వ్యూహాత్మక సంబంధాలను మోడీ అభినందించారు. “మన బంధంలో క్రికెట్ ఉత్సాహం, మిరియాల మసాలా స్పైసు ఉన్నాయి. గ్లోబల్ సౌత్ అభివృద్ధికి మన సహకారం కీలకంగా మారుతుంది” అని మోడీ పేర్కొన్నారు.
57
ప్రధాని మోడీకి ట్రినిడాడ్ లో ఘన స్వాగతం
మోడీ జూలై 4న త్రినిడాడ్ & టొబాగోకు తమ తొలి అధికారిక పర్యటనలో భాగంగా చేరుకున్నారు. పియార్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రధాని కమలా పర్సాడ్-బిసెసర్ (Kamla Persad-Bissessar), 38 మంది మంత్రులు, నలుగురు ఎంపీలతో పాటు ఇతర అధికారులు మోడీకి ఘన స్వాగతం పలికారు. భారతీయ మూలాల కలిగిన చాలా మంది సంప్రదాయ డ్రమ్స్, సంగీతంతో ఘన స్వాగతం పలికారు. మోడీ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X లో పంచుకున్నారు.
67
ఘానాలోనూ మోడీకి గౌరవం
ట్రినిడాడ్ పర్యటనకు ముందు ప్రధాన మోడీ ఘానా దేశాన్ని సందర్శించారు. అక్కడ ఆయనకు 'ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘానా' (Officer of the Order of the Star of Ghana) అనే గౌరవం లభించింది. ఈ అవార్డును ఘానా అధ్యక్షుడు జాన్ డ్రమాని మహామా (John Dramani Mahama) అందజేశారు. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకారం, మోడీ గ్లోబల్ లీడర్గా చూపిన ప్రభావం, కరోనా సమయంలో చేసిన మానవతా సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం ఇచ్చారు.
77
ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోడీ ట్రినిడాడ్ పర్యటన
ప్రధాని మోడీ జూలై 2 నుంచి 9 వరకు ఐదు దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఘానా, ట్రినిడాడ్ & టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలు ఉన్నాయి. జూలై 5 నుంచి 8 వరకు బ్రెజిల్లో జరిగే 17వ బ్రిక్స్ సదస్సులో (BRICS Summit 2025) కూడా ప్రధాని మోడీ పాల్గొననున్నారు. తర్వాత నమీబియా పర్యటనతో పర్యటన ముగించనున్నారు.
పర్యటనలో భాగంగా లభించిన గౌరవాలు, ద్వైపాక్షిక సంబంధాలకు వచ్చిన నూతన ఉత్సాహం భారత విదేశాంగ విధానంలో మోడీ నాయకత్వానికి పెద్ద గుర్తింపుగా నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లోని భారతీయ వలస ప్రజలకు మోడీ సందేశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ దేశప్రతిష్ఠను గణనీయంగా పెంచే చర్యలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.