ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌లో కేంద్రం భారీ సంస్క‌ర‌ణ‌లు.. హైప‌వ‌ర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

Published : Jul 26, 2026, 08:18 PM IST

PM Modi: దేశంలో పోటీ పరీక్షల నిర్వహణను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ వ్యవస్థ రూపకర్త నందన్ నీలేకణి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు.

PREV
14
విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకే ఈ నిర్ణయం

సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సందేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిని ఇప్పటికే జైలుకు పంపించామని తెలిపారు. పేపర్ లీక్ వంటి కేసుల విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాదు, మరింత కఠినమైన చట్టాలను తీసుకురావడానికి పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. భవిష్యత్తు పరీక్షల వ్యవస్థ పూర్తిగా నమ్మకమైనదిగా, పారదర్శకంగా ఉండాలంటే ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు. అందుకే నందన్ నీలేకణి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

24
టాస్క్ ఫోర్స్‌లో ఎవరు ఉన్నారు?

ఈ హైపవర్ టాస్క్ ఫోర్స్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ నిపుణులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పరీక్షల నిర్వహణలో సాంకేతిక, పరిపాలనా, భద్రతా అంశాలపై సమగ్ర సంస్కరణలు సూచించే బాధ్యత వీరిపై ఉంటుంది. టాస్క్ ఫోర్స్‌లో ఉన్న ప్రముఖులు.. నందన్ నీలేకణి – టెక్నాలజీ నిపుణుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు. ఎస్. సోమనాథ్ – మాజీ ఇస్రో ఛైర్మన్. తపన్ డేకా – మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) డైరెక్టర్ వి. కామకోటి – ఐఐటీ మద్రాస్ డైరెక్టర్. అనితా కర్వాల్ – మాజీ విద్యాశాఖ కార్యదర్శి. అమృత్ లాల్ మీనా – లాజిస్టిక్స్ నిపుణుడు. ఈ బృందం ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్షల నిర్వహణలో సాంకేతిక మార్పులు, వ్యవస్థాగత సంస్కరణలపై సిఫార్సులు చేయనుంది.

34
నందన్ నీలేకణి ఎవరు?

నందన్ నీలేకణి భారత ఐటీ రంగంలో ప్రముఖ వ్యక్తి. ఆయన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ప్రస్తుతం ఆ సంస్థకు ఛైర్మన్‌గా ఉన్నారు. భారతదేశంలో ఆధార్ కార్డుల కోసం రూపొందించిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) తొలి ఛైర్మన్ కూడా ఆయనే. ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన నీలేకణి, దేశంలో డిజిటల్ సేవల విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 2023లో జీ20 డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టాస్క్ ఫోర్స్‌కు కో-చైర్మన్‌గా నియమితులయ్యారు. వ్యాపారం, సాంకేతికత, డిజిటల్ ఆవిష్కరణల రంగాల్లో చేసిన సేవలకు గాను పద్మభూషణ్, ఫోర్బ్స్ ఆసియా బిజినెస్‌మ్యాన్ ఆఫ్ ది ఇయర్, టైమ్ మ్యాగజైన్ ప్రభావశీల వ్యక్తుల జాబితా వంటి అనేక ప్రతిష్ఠాత్మక గౌరవాలు అందుకున్నారు. అలాగే ఇమేజింగ్ ఇండియా, రీబూటింగ్ ఇండియా, ది ఆర్ట్ ఆఫ్ బిట్‌ఫుల్‌నెస్ వంటి పుస్తకాలను రచించారు.

44
నీట్ లీక్ ఆందోళనల తర్వాత కేంద్రం కీలక నిర్ణయాలు

నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజన సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో పాటు పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు డిమాండ్లను అంగీకరించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు నందన్ నీలేకణి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా భవిష్యత్తులో ఎన్‌టీఏతో పాటు ఇతర జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు అమలు చేసే అవకాశం ఉంది. దీంతో ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల అక్రమాలను అరికట్టడంతో పాటు విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంచడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా భావిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories