Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఆపరేషన్ సిందూర్ తో ఇవి తారాస్థాయికి చేరాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఏకంగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్ళి మరీ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేపట్టారు. ఇందులో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ కూడా సరిహద్దుల్లోని భారత గ్రామాలే టార్గెట్ గా దాడులకు దిగుతోంది. ఇలా పాక్ ఆర్మీ దాడుల్లో పలువురు భారత పౌరులు మరణించారు.
ఇలా జమ్మూ కాశ్మీర్ తో పాటు పాక్ తో సరిహద్దులు కలిగిన రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మే 9 అంటే శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి సెలవు ప్రకటించింది. జమ్ము, సాంబ, కథువా, రాజౌరి మరియు పూంచ్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.