
ఈ వేసవి కాలంలో మండుటెండలతో పాటు భారీ వర్షాలు తప్పేలా లేవు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో అల్పపీడనాలు కొనసాగుతున్నాయట… ఇందులో ఏ ఒక్కటీ తుపానుగా మారినా భారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదు. ఈ అల్పపీడనాల ప్రభావం ఎలా ఉండనుంది..? ఏఏ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముంది…? తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి..? అనే సమాచారాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో వరుస అల్పపీడనాలు రెడీగా ఉన్నాయని… ఇవి చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.. ఉత్తర పాకిస్థాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడింది. దీంతో పాటు మధ్య రాజస్థాన్, హరియాణా, తూర్పు ఉత్తరప్రదేశ్, ఈశాన్య బంగ్లాదేశ్, ఉత్తర కోస్తా ఒడిశా పైన కూడా అల్పపీడన ద్రోణులు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ వాతావరణ మార్పుల వల్ల ఏప్రిల్ 18, 19 తేదీల్లో జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అంతేకాదు ఈ రాష్ట్రాల్లో గంటకు 30-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని…తేలికపాటి వర్షాలతో పాటు హిమపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. జమ్మూ కశ్మీర్ లో అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశాలున్నాయని IMD హెచ్చరిస్తోంది.
ఏప్రిల్ 18, 19న హిమాచల్ ప్రదేశ్లో… ఏప్రిల్ 18న ఉత్తరాఖండ్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది. పంజాబ్లో ఏప్రిల్ 18న తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఈశాన్య భారతదేశంలో ఏప్రిల్ 18 నుంచి 21 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో ఏప్రిల్ 18 నుంచి 21 వరకు… అసోం, మేఘాలయాలలో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు… నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఏప్రిల్ 18 నుంచి 20 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రాష్ట్రాల్లో ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందంటోంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవొచ్చు.. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఒడిశాలో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు… ఉత్తర బెంగాల్, సిక్కింలో ఏప్రిల్ 18 నుంచి 21 వరకు… గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, బిహార్లలో ఏప్రిల్ 18, 19 తేదీల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. ఉత్తర బెంగాల్, సిక్కింలో ఏప్రిల్ 18, 19 తేదీల్లో భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తోంది.
విదర్భలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో… ఛత్తీస్గఢ్లో ఏప్రిల్ 18, 20, 21 తేదీల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందంటోంది IMD. పశ్చిమ మధ్యప్రదేశ్లో ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయట. కర్ణాటకలోని అంతర్గత ప్రాంతాల్లో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు వర్షాలు, తుపానులు సంభవించవచ్చని హెచ్చరించింది. కేరళ, ఉత్తర కర్ణాటకలో ఏప్రిల్ 18 నుంచి 21 వరకు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లపై కూడా అల్పపీడనాల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యానాంలో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు వర్షాలు కురుస్తాయట. రాయలసీమలో ఏప్రిల్ 20 నుంచి 22 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో రేపు, ఎల్లుండి (ఆది, సోమవారం) విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ రెండ్రోజులు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలుంటాయని... ఈదురుగాలులు, పిడుగుల వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరించారు.
తెలంగాణ విషయానికి వస్తే ఏప్రిల్ 18, 19, 20 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడాలో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు… కొంకణ్, గోవాలో ఏప్రిల్ 20, 21 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందంటోంది IMD. అక్కడక్కడా వడగళ్ల వాన కురిసే సూచనలున్నాయని.. ప్రజలు మరీముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.