Pahalgam Terror Attack
Pahalgam Terror Attack: భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్రకృతి అందాలను చూసేందుకు వెళ్లిన అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ సమ్మర్ ఎండలనుండి ఉపశమనం కోసం చల్లని కాశ్మీర్ పర్యటనకు ఉత్సాహంగా వెళ్లినవారు ఇప్పుడు శవాలుగా తిరిగివస్తున్నారు. మానవత్వాన్ని మరిచిన రాక్షసులు హిందువులే టార్గెట్ గా మారణహోమం సృష్టించారు.
అనంత్ నాగ్ జిల్లా పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఐడీ కార్డులు చూసి కొందరిని, నమాజ్ చదవడం రాకపోవడంతో మరికొందరిని హిందువులుగా గుర్తించి కాల్చిచంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చివరకు కొందరితో ప్యాంటు విప్పించి మరీ ముస్లీంలు కాదని నిర్దారించుకుని హతమార్చినట్లు చెబుతున్నారు. ఇలా ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నవారిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాలనుండి వెళ్లినవారు ఉన్నారు.
Pahalgam Terror Attack
విశాఖవాసిని వెంటాడిమరీ కాల్చిచంపిన దుండగులు :
భారతదేశంలో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన ప్రాంతం పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ. ఇక్కడ స్వచ్చమైన ప్రకృతి సోయగాలను చూసేందుకు దేశ నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ ప్రాంతంలో చల్లటి వాతావరణం ఉంటుందికాబట్టి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇదే బైసరస్ ప్రాంతాన్ని టార్గెట్ చేయడానికి కారణమయ్యింది.
ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించినవారిలో విశాఖపట్నంకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఉన్నారు. స్నేహితులతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన ఇతడు ఉగ్రవాదుల కంటపడ్డాడు. తుపాకులు చేతబట్టి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను చూసి చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేసాడట. కానీ అతడి వెంటపడీమరి కాల్చిచంపారు దుండగులు.
ప్రాణభయంతో చెల్లాచెదురైన స్నేహితులంతా ఒక్కచోటికి చేరగా చంద్రమౌళి మాత్రం కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత చనిపోయిన వారిలో పరిశీలించగా అతడు ప్రాణాలు కోల్పోయి కనిపించాడు. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించిన స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాశ్మీర్ కు వెళుతున్నానని నవ్వుతూ ఇంట్లోంచి వెళ్లినవ్యక్తి ఇలా మృతదేహంగా తిరిగివస్తుండటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Pahalgam terror attack
కుటుంబసభ్యుల ముందే నెల్లూరువాసిని కాల్చిచంపిన దుండగులు :
నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదనరావు ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో స్థిరపడ్డాడు. ఓ ప్రముఖ సాప్ట్ వేర్ కంపనీలో పనిచేస్తున్న ఇతడు ఇందిరానగర్ లో నివాసం ఉంటున్నాడు. పిల్లలకు వేసవి సెలవులు రావడంతో సరదాగా కాశ్మీర్ ను చుట్టివద్దామని వెళ్లాడు... కానీ అతడిని భార్యాపిల్లల ముందే అత్యంత దారుణంగా కాల్చిచంపారు ఉగ్రవాదులు.
మధుసూదనరావు తల్లిదండ్రులు పద్మ, సోమిశెట్టి తిరుపాలు హుద్రోగ రోగులు కావడంతో కొడుకు చనిపోయిన వార్త వారికి తెలియజేయలేదు. కుటుంబసభ్యులు వారికి విషయం తెలియకుండా తమలోతామే బాధపడుతున్నారు. ప్రస్తుతం మధుసూదనరావు మృతదేహం శ్రీనగర్ లో ఉంది... నేడు(బుధవారం) ప్రత్యేక విమానంలో చెన్నైకి, అక్కడినుండి కావలికి తరలించనున్నారు.
Pahalgam terror attack
హైదరాబాద్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మృతి :
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో పనిచేసే మనీష్ రంజన్ కుటుంబంతో కలిసి జమ్మూకాశ్మీర్ పర్యటనకు వెళ్ళాడు. భార్యా పిల్లలతో కలిసి బస్సులో వెళుతుండగా ఉగ్రవాదులు అడ్డుపడ్డారు... వీరిని కిందకు దించి పేర్లు అడిగారట. ఈ క్రమంలోనే మనీష్ రంజన్ ను చుట్టుముట్టిన దుండగులు భార్యాపిల్లలు చూస్తుండగానే కాల్చి చంపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మనీష్ రంజన్ సొంత రాష్ట్రం బిహార్... 2022 లో బదిలీపై హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ క్వార్టర్స్ లో ఒంటరిగా నివాసముంటున్నాడు... దీంతో కుటుంబాన్ని బాగా మిస్ అవుతున్న అతడు వారితో సరదాగా గడిపేందుకు కాశ్మీర్ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. బిహార్ నుండి కుటుంబసభ్యులతో కాశ్మీర్ వెళ్ళాడు... కానీ ఉగ్రవాదుల కాల్పుల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడు.