Delhi: కేంద్రం సంచలన నిర్ణయం.. ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం. దీంతో ఏం జరగనుందంటే.?

Published : Jul 23, 2026, 03:15 PM IST

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు, శాంతిభద్రతల పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

PREV
15
పోలీస్ కమిషనర్‌కు లభించిన ప్రత్యేక అధికారాలు ఏంటి.?

జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనల ప్రకారం ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు నిర్దిష్ట కాలపరిమితి వరకు ప్రత్యేక అధికారాలు అమల్లోకి వచ్చాయి. ఈ అధికారాల ద్వారా ప్రజా భద్రతకు లేదా శాంతిభద్రతలకు ముప్పుగా భావించే వ్యక్తులపై చట్టప్రకారం నిర్బంధ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ అధికారాలు జులై 19 నుంచి అక్టోబర్ 18 వరకు అమల్లో ఉంటాయి. దేశ రాజధానిలో భద్రతా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

25
నిరసనలతో సంబంధం లేదన్న ఢిల్లీ పోలీసులు

ఈ నిర్ణయం నీట్ పరీక్షల వ్యవహారంపై కొనసాగుతున్న నిరసనలను అణచివేసేందుకేనని ప్రచారం జ‌ర‌గ‌డంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు. పోలీస్ కమిషనర్‌కు ఈ అధికారాలు ఇవ్వడం కొత్త విషయం కాదని, ఇది ప్రతి మూడు నెలలకోసారి జరిగే సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. అధికారాల పునరుద్ధరణకు సంబంధించిన ఉత్తర్వులు నిరసనలు తీవ్రరూపం దాల్చకముందే జారీ అయ్యాయని, ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనల కారణంగా ప్రత్యేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఈ రెండు అంశాలను ముడిపెట్టి చూడడం సరైనది కాదని కూడా వెల్లడించారు.

35
నీట్ వ్యవహారంపై ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు

నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా మరింత విస్తరించాయి. విద్యార్థులతో పాటు వివిధ యువజన సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఈ నిరసనలకు మద్ధతు తెలుపుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి యువత ఢిల్లీకి చేరుకుని ఆందోళనల్లో పాల్గొంటోంది. పరీక్షల పారదర్శకత, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యార్థులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో ఉద్యమం కొనసాగుతోంది.

45
జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. పోలీసు-నిరసనకారుల ఘర్షణ

గతకొన్ని రోజులుగా  జంతర్ మంతర్ సమీపంలోని సంసద్ మార్గ్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు రంగంలోకి దిగాయి. ఘర్షణల అనంతరం కొన్ని ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అదనపు బలగాలను మోహరించడంతో పాటు అవసరమైన చోట్ల పరిమితులు కూడా అమలు చేశారు.

55
ప్రత్యేక అధికారాల లక్ష్యం ఇదే..

ప్రజల భద్రత, చట్టవ్యవస్థ పరిరక్షణ కోసం అవసరమైన సందర్భాల్లో ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఈ అధికారాలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు తలెత్తితే చట్టప్రకారం తక్షణ నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు పోలీస్ కమిషనర్‌కు ఉంటుంది. అయితే ఈ అధికారాలు శాశ్వతం కావని, నిర్దిష్ట కాలానికి మాత్రమే పరిమితమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ రాజధానిలో భద్రతను బలోపేతం చేయడం, ప్రజా శాంతిని కాపాడడం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు పరిపాలనా పరంగా అమలు చేస్తున్న సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories