Jantar Mantar: ముంబై, హైద‌రాబాద్ నుంచి జంత‌ర్‌మంత‌ర్‌కి.. భారీగా జొమాటో, స్విగ్గీ ఆర్డ‌ర్లు

Published : Jul 23, 2026, 08:26 AM IST

Jantar Mantar: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు దేశం నలుమూలల నుంచి అనూహ్యమైన మద్ధతు లభిస్తోంది. నిర‌స‌న తెలుపుతోన్న విద్యార్థులకు ప్రజలు స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా ఆహారం పంపిస్తున్నారు.

PREV
14
ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేసి విద్యార్థులకు పంపిస్తున్న ప్రజలు

జూలై 20న జరిగిన ఆందోళనల తర్వాత మహారాష్ట్రకు చెందిన అనుజ్ రావత్ అనే వ్యక్తి జొమాటో ద్వారా ఆహారం ఆర్డర్ చేసి, అక్కడ ఆకలితో ఉన్న ఎవరికైనా అందించాలని డెలివరీ పార్ట్‌నర్‌కు సూచించినట్లు సమాచారం. అలాగే గ్రేటర్ కైలాష్‌కు చెందిన అనిల్ యాదవ్ స్విగ్గీ ద్వారా 25 వెజ్ థాళీలను పంపించి విద్యార్థులకు మద్ధతు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇదే తరహాలో అనేక మంది ఆహారం పంపిస్తున్నట్లు తెలుస్తోంది.

24
స్థానికులు కూడా స్వయంగా ఆహారం తీసుకొచ్చిన ఘటనలు

ఆన్‌లైన్ డెలివరీలతో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా స్వయంగా ఆహారం తీసుకొచ్చి విద్యార్థులకు అందిస్తున్నారు. చావ్డీ బజార్‌కు చెందిన ఉస్మాన్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఆందోళనల వీడియోలు చూసిన తర్వాత తమ కాలనీ ప్రజల సూచనతో ఆహారం తీసుకొచ్చినట్లు తెలిపాడు. అలాగే ఫరీదాబాద్‌కు చెందిన శివమ్ తన సోదరుడితో కలిసి వచ్చి నిరసనకారులకు భోజనం అందించాడు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులకు మద్ధతుగా ఈ చర్యలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు.

34
ఆహారం, నీరు, మందులతో నిండిన నిరసన ప్రాంగణం

జంతర్‌మంతర్ వద్ద ప్రస్తుతం పిజ్జాలు, బర్గర్లు, వెజ్ థాళీలు, వాట‌ర్ బాటిల్స్‌, అవసరమైన మందులు వంటి వస్తువులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచినట్లు అక్కడి దృశ్యాలు చూపిస్తున్నాయి. అవసరమైన వారు వాటిని ఉచితంగా తీసుకునేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ఉద్రిక్త ఘటనల తర్వాత కూడా మంగళవారం పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడే నిరసనలు కొనసాగించారు. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు సెక్షన్ 163 అమలు చేస్తూ, పెద్ద సంఖ్యలో గుమికూడవద్దని హెచ్చరిస్తున్నారు.

44
సోషల్ మీడియాలో భిన్న స్పందనలు.. ఆహారం పంపొద్దని సీజేపీ విజ్ఞప్తి

ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఆహారం పంపించడం విద్యార్థుల పట్ల సంఘీభావానికి నిదర్శనమని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు ఈ నిరసనలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరికొందరు భద్రతా పరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తూ, తెలియని వ్యక్తులు పంపే ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం అవసరమైనంత ఆహారం అందుబాటులో ఉందని, ఇకపై స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ద్వారా ఆహారం లేదా ఇతర వస్తువులు పంపవద్దని కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories