Delhi: ఆగ‌స్టు 4వ తేదీన ప్ర‌ధాని నివాసానికి మార్చ్‌.. మ‌రో ఉద్య‌మానికి సిద్ధం

Published : Aug 01, 2026, 10:14 PM IST

Delhi: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ20 పెట్రోల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఆగస్టు 4న ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వరకు నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

PREV
14
ప్రధాని నివాసానికి పిటిషన్‌తో వెళ్లనున్న కేజ్రీవాల్

న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన కేజ్రీవాల్, ఈ20 పెట్రోల్‌పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన సంతకాల సేకరణకు ఇప్పటికే రెండు లక్షలకు పైగా మంది తమ మద్ధతు తెలిపారని పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను స్వయంగా ప్రధాని నివాసానికి తీసుకెళ్లి సమర్పిస్తానని చెప్పారు. ఈ నిరసనలో భారీ జనసమూహం అవసరం లేదని, లాఠీచార్జ్‌కు భయపడని వంద మంది కార్యకర్తలతో మాత్రమే మార్చ్ నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు.

24
ప్రభుత్వం ముందు మూడు ప్రధాన డిమాండ్లు

ఈ20 పెట్రోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకోవాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. వాహనదారులకు సాధారణ పెట్రోల్ లేదా ఈ20 పెట్రోల్‌లో ఏది ఉపయోగించాలో ఎంపిక చేసే స్వేచ్ఛ ఇవ్వాలని మొదటి డిమాండ్‌గా పేర్కొన్నారు. ఒకవేళ ఈ20 పెట్రోల్‌ను తప్పనిసరి చేయాలనుకుంటే, అది సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ధరకు విక్రయించాలని కోరారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలో పెట్రోల్ ధరను లీటర్‌కు రూ.84 కంటే తక్కువకు తీసుకురావాలని సూచించారు.

34
ఈ20 పెట్రోల్ వల్ల వినియోగదారులకు నష్టం జరుగుతోందన్న ఆరోపణ

ఈ20 పెట్రోల్ వినియోగం వల్ల వాహనదారులకు ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కారణంగా వాహనాల మైలేజీ తగ్గుతోందని, ఇంజిన్ పనితీరుపై కూడా ప్రభావం పడుతోందని అన్నారు. రైతులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దగా లాభం లేకపోయినా ఈ విధానాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ప్రజలపై ఒకే రకమైన ఇంధనాన్ని బలవంతంగా రుద్దడం సరైన విధానం కాదని విమర్శించారు.

44
అమెరికా వాణిజ్య ఒప్పందంపై కూడా విమర్శలు

ఈ20 పెట్రోల్ విధానం వెనుక అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ఇథనాల్ ఉత్పత్తి పెరగడం వల్ల పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ20 విధానాన్ని పునఃసమీక్షించాలని, వాహనదారుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Read more Photos on
click me!

Recommended Stories